ఒలింపిక్స్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సమాయత్తమవుతోంది. 2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణకు ఆసక్తిగా ఉన్నామని తెలియజేస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)కి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) లేఖను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీనే ఈ లేఖను పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని, ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గమని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్న విషయం తెలిసిందే.

'2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం దేశప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారు. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తాం. ఏ విషయంలోనూ వెనకడుగు వేయం. ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల భారతీయుల కల. అలాగే 2029 యూత్ ఒలింపిక్స్ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం'అని ఓ సమావేశంలో మోదీ అన్నారు.
ఇప్పటికే 2028 లాస్ ఏంజిల్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ వేదికలు ఖరారయ్యాయి. దాంతో అన్ని దేశాల చూపు 2036 ఒలింపిక్స్పై పడింది. ఈ ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల రేసులో భారత్ ఉందని ఇండియన్ ఒలింపిక్ కమిటీ గతంలో పేర్కొంది.

2025 ఐఓసీ అధ్యక్ష ఎన్నికల తర్వాత 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేయనున్నారు. బిడ్డింగ్ నిర్వహించకుండా ఆసక్తి ఉన్న దేశాల నుంచి దరఖాస్తులను పరిశీలించి ఐఓసీ నాయకత్వ విభాగం ఆతిథ్య హక్కులను కట్టబెట్టనుంది.
స్పాన్సర్లు, ప్రసార హక్కులు, ప్రభుత్వ మద్దతు, ప్రజల ఆదరణ.. ఇలా ఏం చూసుకున్నా భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల ఐఓసీకి లాభం చేకూరనుంది. ఈ క్రమంలోనే ఐఓసీ కూడా భారత్కు ఆతిథ్య హక్కులు కట్టబెట్టేందుకు ఆసక్తిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.