కండరాలు పట్టేసేవి
'కరోనా వైరస్ మహమ్మారి లాక్డౌన్ తర్వాత సాధన మొదలు పెట్టాను. ఆ సమయంలో నా వీపుభాగం పట్టేసినట్టు అయ్యేది. కుడి భుజానికి సమస్య వచ్చింది. గాయం కాలేదు కాదు గానీ ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు కండరాలు పట్టేసేవి. లాక్డౌన్లో విశ్రాంతి తీసుకోవడం వల్లే అలా జరిగింది. భుజం సమస్య వల్ల స్నాచ్ సరిగా చేయలేకపోయాను. దాంతో చాలా భయపడ్డాను. మళ్లీ మునుపటి ఫామ్ అందుకుంటానా.. లేదా అని ఆందోళన చెందా. నా ఆట ముగిసిందా అని ఒక్కోసారి అనిపించేది. చివరకు అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది' అని మీరాబాయి చాను తెలిపింది.
చికిత్స కోసం అమెరికాకు
'చికిత్స కోసమే మేం అమెరికా వెళ్లాం. మాజీ వెయిట్ లిఫ్టర్, ఫిజియో థెరపిస్టు, డాక్టర్ ఆరోన్ హార్స్చిగ్ వద్దకు వెళ్లడం లాభం చేకూర్చింది. ఆపై ఆసియా ఛాంపియన్షిప్స్లో ప్రపంచ రికార్డు సాధించగలిగాను. కండరాల మధ్య సమతూకం లేదు. అందుకే బరువులు ఎత్తగానే నొప్పి వచ్చేది.
డాక్టర్ కొన్ని కసరత్తులు సూచించారు. అవి ఉపయోగపడ్డాయి' అని మీరాబాయి చాను చెప్పింది. 2017లో ప్రపంచ ఛాంపియన్షిప్, 2018లో కామన్వెల్త్లో స్వర్ణాలు గెలిచాక మీరా వెన్నెముక దిగువభాగంలో నొప్పితో బాధపడింది. దాంతో 2018 ఆసియా క్రీడలు ఆడలేదు. కోలుకున్న తర్వాత వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెట్టింది.
టీ20ల్లో హీరో.. వన్డేల్లో మాత్రం జీరో! వెస్టిండీస్ టీమ్ వైఫల్యాలకు అసలు కారణాలు ఇవే!!
ఇంటివద్ద 10 రోజులే
'ఒలింపిక్స్ 2020 వాయిదా పడితే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. తక్కువ సమయంలోనే ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఒకదాని తర్వాత ఒక సమస్య రావడం చూశాను' అని మీరాబాయి చాను చెప్పుకొచ్చింది. ఐదేళ్లలో ఇంటి వద్ద గడిపింది పది రోజులేనని, ఇప్పుడూ ఇంటి వద్ద ఎక్కువ రోజులేం ఉండనని స్పష్టం చేసింది. పది రోజులు ఉండి కామన్వెల్త్ అర్హత పోటీలకు సిద్ధమవుతానని ఆమె వెల్లడించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కిలోల పోటీల్లో మీరాబాయి చాను రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. తెలుగు తేజం కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి ఆమె పతకం అందించింది.