
అగర్తలా : కరోనా కారణంగా ప్రపంచమే ఆగిపోయింది. ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. మహమ్మారి కట్టడికి దేశంలో విధించిన లాకౌడౌన్తో అన్ని స్టేడియాలు మూతపడ్డాయి. దాంతో క్రీడాకారులందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దేశంలో అన్లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యాక మూడో దశ సడలింపుల్లో భాగంగా స్టేడియాల్లో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లో స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టగా... తాజాగా త్రిపుర రాజధాని అగర్తలాలో భారత మేటి మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్తోపాటు ఇతర జిమ్నాస్ట్లు తమ ప్రాక్టీస్ను షురూ చేశారు. స్థానిక నేతాజీ సుభాష్ రీజినల్ కోచింగ్ సెంటర్ (ఎన్ఎస్ఆర్సీసీ) ఇండోర్ స్టేడియంలో దీపా కర్మాకర్ తన కోచ్ బిశ్వేశ్వర్ నందితో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుదీర్ఘ విరామం తర్వాత స్టేడియానికి రావడం ఆనందంగా ఉందని తెలిపింది.'మార్చి 16న జిమ్నాజియం మూతపడింది. ఐదున్నర నెలలు ఇంట్లోనే ఉండిపోయా. సుదీర్ఘకాలం పాటు దూరంగా ఉంటే జిమ్నాస్ట్ల మానసికంగా బలహీనులవుతారు. అయితే ట్రైనింగ్ లేని సమయంలో నా వ్యక్తిగత కోచ్ బిశ్వేశ్వర్ నంది ఆన్లైన్లో ఫిట్నెస్ తరగతులు తీసుకొని అలా కాకుండా చూశారు. మళ్లీ ఇక్కడకు వచ్చినందుకు సంతోషంగా ఉంది' అని దీపా కర్మాకర్ వ్యాఖ్యానించింది.
2016 రియో ఒలింపిక్స్లో వాల్టింగ్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన దీపా కర్మాకర్ ఆ తర్వాత గాయాలబారిన పడి మరో మెగా ఈవెంట్లో బరిలోకి దిగలేకపోయింది. అయితే రియో ఒలింపిక్స్లో అత్యంత ప్రమాదకరమైన చావుతో చెలగాటం అని పిలిచే ప్రొడునోవా విన్యాసంతో జిమ్నాస్టిక్స్ ప్రపంచాన్ని దీపా అబ్బురపరిచింది.
ఆమె పతకం నెగ్గకపోయినా ఈ విన్యాసమే అందరిచేత శెభాష్ అనేలా చేసింది. ఆమె ప్రదర్శనను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆమె అర్జున అవార్డుతో పాటు, ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు కూడా అందుకున్నారు. ఇక ప్రస్తుతం వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.