
న్యూఢిల్లీ: భారత స్టార్ రైఫిల్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్ ఖేల్రత్న' రేసులో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన 26 ఏళ్ల అంజుమ్ మౌద్గిల్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసినట్లు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) గురువారం ప్రకటించింది. యువ షూటర్లను మెరికల్లా తీర్చిదిద్దుతోన్న ప్రముఖ కోచ్ జస్పాల్ రాణాను రెండో సారీ 'ద్రోణాచార్య'అవార్డు బరిలో ఉంచినట్లు తెలిపింది.
వీరితో పాటు పిస్టల్ షూటర్లు సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, మను భాకర్... రైఫిల్ షూటర్ ఎలవనీల్ వలరివన్ పేర్లను 'అర్జున' అవార్డు కోసం కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సు చేసింది. అర్హులైన అత్యుత్తమ షూటర్లనే అవార్డుల కోసం నామినేట్ చేశామని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్ పేర్కొన్నారు. చండీగఢ్కు చెందిన 26 ఏళ్ల అంజుమ్ 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇప్పటికే టోక్యో బెర్తు సాధించింది.
షూటింగ్లో సంచలనాలు నమోదు చేస్తోన్న టీనేజ్ షూటర్లు మను భాకర్, సౌరభ్, అనీశ్ భన్వాలాలను.. ప్రపంచ స్థాయి షూటర్లుగా తీర్చిదిద్దిన 43 ఏళ్ల జస్పాల్ రాణా ఈసారి ద్రోణాచార్య పురస్కారాన్ని ఆశిస్తున్నారు. గతేడాదే రాణాకు ద్రోణాచార్య దక్కకపోవడంతో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా సెలక్షన్ ప్యానల్ను బహిరంగంగా విమర్శించాడు.
కొరియాలో జరిగిన వరల్డ్క్పలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం సాధించిన అంజుమ్..గతేడాది బీజింగ్లో జరిగిన వరల్డ్కప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దివ్యాంశ్ సింగ్ పన్వర్తో కలసి స్వర్ణం సాధించింది.