భారత చెస్ చిచ్చర పిడుగు ఆర్. ప్రజ్ఞానంద మరో సంచలన విజయాన్ని అందుకున్నాడు. నార్వే చెస్ టోర్నీలో మరోసారి వరల్డ్ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్కు షాకిచ్చాడు. అయితే, ఈసారి మాగ్నస్ కార్ల్సన్ను అతని సొంతగడ్డపై ఓడించడం విశేషం. నార్వేలోని స్టావెంజర్ వేదికగా బుధవారం అర్ధరాత్రి జరిగిన మూడో రౌండ్ క్లాసికల్ విభాగంలో 14వ ర్యాంకర్ ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లోనే కార్ల్సన్ను చిత్తు చేశాడు.
ఆరుగురు చెస్ ప్లేయర్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో ఓపెన్ సెక్షన్ విభాగంలో ప్రజ్ఞానంద అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద కార్ల్సన్ను ఓడించి మొత్తం 9 పాయింట్లకు 5.5 పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అమెరికన్ గ్రాండ్మాస్టర్ ఫాబియో కరౌనా రెండో స్థానంలో నిలిచాడు.

క్లాసికల్ విభాగంలో కార్ల్సన్పై ప్రజ్ఞానందకు ఇదే తొలి విజయం. ప్రజ్ఞానంద చేతిలో ఓడిన మాగ్నస్ కార్ల్సన్ ఓపెన్ సెక్షన్లో ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు. ప్రజ్ఞానంద చాలా ప్రశాంతంగా ఆడి విజయాన్ని సాధించాడు. తెల్లపావులతో కార్ల్సన్ ఓడించి కీలక మూడు పాయింట్స్ అందుకున్నాడు.
గతేడాది జరిగిన ప్రపంచకప్లో మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిన ప్రజ్ఞానందకు ఈ విజయం పెద్ద ప్రోత్సాహంగా మారనుంది. కార్ల్సన్ను ఓడించిన నాలుగో భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. మహిళల విభాగంలో ప్రజ్ఞానం సోదరి ఆర్ వైశాలి అగ్రస్థానంలో కొనసాగుతోంది.