న్యూఢిల్లీ: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. ఈ పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. దేశంలోని ప్రతీ ఒక్క భారతీయుడి తనకు అండగా నిలిచారని, వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పాడు.
హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా ఆదివారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఫైనల్స్లో 25 ఏళ్ల నీరజ్ చోప్రా.. జావెలిన్ను 88.17 మీటర్లు విసిరి అదరగొట్టాడు. ఈ గెలుపుతో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు.

రెండేళ్ల క్రితమే ఒలింపిక్ గోల్డ్మెడల్ గెలిచిన నీరజ్ చోప్రాకు అథ్లెటిక్స్ పసిడి పతకం కల కూడా నెరవేరింది. ఈ విజయానంతరం మాట్లాడిన నీరజ్ చోప్రా 90 మీటర్ల మార్క్ అందుకోవడమే తన తదుపరి లక్ష్యమని చెప్పాడు. భవిష్యత్తులో ఇది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అయితే 90 మీటర్ల లక్ష్యం అందుకోవడం కంటే దేశానికి పతకాలు సాధించడాన్నే గొప్పగా భావిస్తానని చెప్పుకొచ్చాడు.
'ప్రతీ ఒక్క భారతీయుడికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే అర్థరాత్రి వరకు మెళకువగా ఉండి నాకు మద్దతు తెలిపారు. ఈ బంగారు పతకం వారికే అంకితం. నేను ముందుగా ఒలింపిక్ ఛాంపియన్ అయ్యాను. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్గా నిలిచాను. భారతీయులు ఏదైనా చేయగలరు. కష్టపడటమే మాత్రమే మాకు తెలుసు.
ఒలింపిక్ బంగారు పతకం గెలిచిన తర్వాత సాధించిన ఈ విజయం గొప్పది. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలవాలనే కసితో బరిలోకి దిగాను. వరల్డ్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ గెలవడం నా కల. భారత్కు మరో పతకాన్ని అందించినందుకు గర్వంగా ఫీలవుతున్నా. నేను బెస్ట్ జావెలిన్ త్రోయర్ను అని ఏమాత్రం అనుకోలేదు.
ఈటెను మాత్రమే ఎక్కువ దూరం విసరాలనుకున్నా. 90 మీటర్ల మార్క్ ధాటలనుకున్నా. కానీ అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో కచ్చితంగా ఈ మార్క్ అందుకుంటా. ఈ విజయానికి ముందు అందరూ నేను వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ గెలవడమే మిగిలి ఉందని మాట్లాడారు. దాన్ని నేను అందుకున్నాను. ఇక మిగిలింది 90 మీటర్ల మార్క్ను అందుకోవడమే.'అని నీరజ్ చోప్రా చెప్పుకొచ్చాడు.