హైదరాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. గురువారం మూడు స్వర్ణ పతకాలతో సత్తా చాటారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో భమిడిపాటి సాయిప్రణీత్, మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి- పుల్లెల గాయత్రి గోపీచంద్, మహిళల బాస్కెట్బాల్ టీమ్ పసిడి పతకాలతో మెరిశారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సాయిప్రణీత్ 21-11, 12-21, 21-16తో మిథున్ మంజునాథ్ (కర్ణాటక)పై మూడు గేమ్లలో విజయం సాధించి టైటిల్ అందుకున్నాడు.
మహిళల డబుల్స్ తుదిపోరులో సిక్కిరెడ్డి/గాయత్రి గోపీచంద్ ద్వయం 21-14, 21-11 స్కోరుతో అశ్వినీ భట్/శిఖా గౌతమ్ (కర్ణాటక) జోడీని చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. దాంతో బ్యాడ్మింటన్లో తెలంగాణ ముచ్చటగా మూడు బంగారు పతకాలు దక్కించుకున్నట్టయింది. మిక్స్డ్ టీమ్లో ఇంతకుముందే స్వర్ణ పతకం నెగ్గింది. బాస్కెట్బాల్ 3×3లో స్వర్ణం నెగ్గిన తెలంగాణ బాస్కెట్బాల్ జట్టు.. 5×5 విభాగంలోనూ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో తెలంగాణ 67-62తో తమిళనాడుపై విజయం సాధించింది. పుష్ప (23 పాయింట్లు), ప్రియాంక (14), అంబరాశి (13) తెలంగాణ విజయంలో కీలకపాత్ర పోషించారు. కేరళ జట్టు కాంస్యం అందుకుంది.
తెలంగాణ స్విమ్మర్ వ్రితి మరో రెండు పతకాలు సాధించింది. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్లో రజతం, 200 మీటర్ల బటర్ఫ్లై పోటీలో కాంస్యం నెగ్గింది. ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు రజతం లభించింది. ఫైనల్లో సూర్యహంసిని, శరణ్య, షణ్ముఖి, నాగసాయిలత బృందం 222-229 తేడాతో మహారాష్ట్ర చేతిలో పరాజయంపాలైంది. టెన్నిస్ పురుషుల డబుల్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొసరాజు శివదీప్-అనంతమణి ముని జంట కాంస్య పతకం గెలిచింది.