ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాపులర్ ఆర్కిటెక్ట్ సంస్థ అయిన పాపులస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన క్రీడా మైదానాల డిజైన్లను రూపొందించిన ఈ సంస్థ సహకారంతో ఏపీలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పాపులస్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గల్లఘర్, పాపులస్ ఆసియా పసిఫిక్ బిజినెస్ డెవలప్ మెంట్, బిడ్స్ అండ్ కమ్యూనికేషన్ హెడ్ శ్రీమతి ఎలిజిబెట్ డిసిల్వాలతో బుధవారం నారా లోకేష్ సమావేశమయ్యారు. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాపులస్ సంస్థ..అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం, లండన్ ఒలింపిక్ స్టేడియం, న్యూయార్క్లోని యాంకీ స్టేడియం వంటి 3,500కు పైగా ప్రాజెక్టులను డిజైన్ చేసింది. ప్రస్తుతం భారత్లో ఎల్ అండ్ టీతో కలసి మౌలిక సదుపాయల ప్రాజెక్టులపై పనిచేస్తోంది.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఏపీని క్రీడా హబ్గా మార్చేందుకు సహకరించాలని కోరారు. 'రాష్ట్రంలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియంలు, శిక్షణా కేంద్రాల నిర్మాణానికి మీ డిజైన్ సహకారం అందించండి. పర్యావరణ హితమైన, ఇంధన సామర్థ్యం గల క్రీడా, వినోద వేదికల నిర్మాణంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కమ్యూనిటీ క్రీడా సముదాయాలు, పర్యాటకాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఇంటిగ్రేటెడ్ ఈవెంట్ స్పేస్ల డిజైన్లలో కూడా భాగాస్వాములు కావాలి.'అని పాపులస్ సంస్థను లోకేష్ విజ్ఞప్తి చేశారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే విశాఖలో సెర్చ్ ఇంజన్ గూగుల్ వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. మంత్రి నారా లోకేష్ చొరవతో మరిన్ని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయి. ఓవైపు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూనే.. మరోవైపు ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాలు నిర్మించాలనుకుంటుంది.
