భారత క్రీడారంగంలో సరికొత్త విప్లవం.. ఖేలో ఇండియా మిషన్కు రూ. 29,054 కోట్లు!
భారత్లో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఖేలో ఇండియా మిషన్'ను సరికొత్తగా తీర్చిదిద్దింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేసింది. ఇందులో భాగంగా 2026-27 నుంచి 2030-21 కాలానికి ఖేలో ఇండియా మిషన్కు రూ.29,054 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
జాతీయ క్రీడా సమాఖ్యల (NSF) సాయం కోసం కేటాయించిన రూ. 7,387 కోట్లతో కలిపి మొత్తం రూ. 36,441 కోట్ల భారీ నిధులను అందుబాటులోకి తెచ్చింది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య లక్ష్యానికి అనుగుణంగా ఈ నిధులను కేటాయించారు.
ఈ సరికొత్త ప్రణాళికను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఖేలో ఇండియా విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మయాంక్ శ్రీవాత్సవ 'మైఖేల్ 'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇది భారత క్రీడారంగంలో సరికొత్త విప్లవం అని చెప్పుకొచ్చారు.
ఇది సరికొత్త విప్లవం..
'భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ సరికొత్త ఖేలో ఇండియా కార్యక్రమాన్ని క్రీడా ప్రపంచంలో ఒక విప్లవంగా భావించవచ్చు. గత కార్యక్రమంతో పోల్చితే ఈ సారి 8 రెట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ఈ కొత్త వర్షన్ కారణంగా క్రీడాకారుల సంఖ్య కూడా 10 రెట్లు పెరగనుంది.

గతంలో 3,000 మందికి మాత్రమే పరిమితమైన ఖేలో ఇండియా అథ్లెట్ల సంఖ్య ఈసారి 30,000కు పెరగనుంది. ఖేలో ఇండియాకు ఎంపికైన క్రీడాకారుల పూర్తి ఖర్చులను భారత ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతీ క్రీడాకారుడికి అవసరమైన ట్రైనింగ్, పోటీలు, మౌలిక వసతులు, క్రీడా విజ్ఞాన శాస్త్రం తదితర సహాయాన్ని ఈ '720-డిగ్రీ సపోర్ట్ సిస్టమ్' అందిస్తుంది.
గ్రామ స్థాయి నుంచే..
ట్రైనర్స్కు అంతర్జాతీయ ప్రమాణాలతో గుర్తింపునిచ్చేందుకు 'నేషనల్ కోచ్ అక్రిడిటేషన్ బోర్డు'ను ఏర్పాటు చేస్తున్నారు. కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్ కోసం రూ. 748 కోట్లు కేటాయించారు. గ్రామ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు జోనల్ కమిటీలు, టాలెంట్ స్కౌట్లను నియమిస్తారు. శాస్త్రీయ పద్ధతిలో క్రీడాకారులను ఎంపిక చేసి నేరుగా ప్రధాన స్రవంతి శిక్షణలోకి తీసుకొస్తారు.
దేశంలోని దాదాపు 750కి పైగా జిల్లాల్లో 'ఖేలో ఇండియా సెంటర్లు' అందుబాటులోకి వచ్చాయి. వీటికి కొనసాగింపుగా చదువు, క్రీడా శిక్షణ ఒకే చోట లభించేలా 'డిస్ట్రిక్ట్-లెవల్ స్పోర్ట్స్ స్కూల్స్'ను ఏర్పాటు చేయనున్నారు. క్రీడా పోటీలు, లీగ్ల నిర్వహణకు రూ. 2,358 కోట్లు కేటాయించారు. పాఠశాల, విశ్వవిద్యాలయ, ప్రాంతీయ లీగ్లను క్రమం తప్పకుండా నిర్వహిస్తారు.'అని శ్రీవాత్సవ చెప్పుకొచ్చారు.
క్రీడలను కేవలం ఉద్యోగం పొందే మార్గంగా కాకుండా, పూర్తిస్థాయి కెరీర్గా ఎంచుకునేలా తల్లిదండ్రులు, పిల్లలలో మైండ్ సెట్ మార్చడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని శ్రీవాత్సవ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన క్రీడాకారుడు సైతం దేశానికి పతకం సాధించి పెట్టే స్థాయికి ఎదిగేలా స్పష్టమైన మార్గాన్ని సుగమం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications