పారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నీరజ్ చోప్రా, మను భాకర్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో ఇద్దరూ సిగ్గుపడుతూ మాట్లాడుకోవడం.. ఒకరికొకరు చూసుకోకపోవడం సందేహాలకు దారి తీసింది.
అంతేకాకుండా మను భాకర్ తల్లి.. నీరజ్ చోప్రాతో ఒట్టు వేయించుకోవడం కూడా వారి పెళ్లి వార్తలకు బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై మనుభాకర్ తండ్రి రామ్ కిషన్ బాకర్ స్పందించారు. మను భాకర్ ఇంకా చిన్నపిల్లే అని, ఆమెకు పెళ్లి వయసు రాలేదని స్పష్టం చేశారు.

'మను భాకర్ ఇంకా చిన్నపిల్ల. ఆమెకు పెళ్లి వయసు కూడా రాలేదు. మేం అసలు ఆ విషయం గురించి ఆలోచించడం కూడా లేదు.'అని చెప్పుకొచ్చారు. తన సతీమణి నీరజ్ చోప్రాను ఓ బిడ్డలా మాత్రమే భావిస్తోందని తెలిపారు. మరోవైపు నీరజ్ బంధువుల కూడా ఈ వార్తలను ఖండించారు. 'నీరజ్ పతకం తెచ్చినప్పుడు దేశం మొత్తం ఎలా చూసిందో అలాగే పెళ్లి విషయం అందరికీ తెలుస్తోంది.'అని స్పష్టం చేశారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా రజత పతకం గెలవగా.. మనుభాకర్ రెండు కాంస్య పతకాలు సాధించింది. నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ 2020 కంటే మెరుగైన ప్రదర్శన చేసినా.. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ను ధాటలేకపోయాడు. ఈటెను 89.45 మీటర్లు మాత్రమే విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి ఈ ఒలింపిక్స్లో తొలి పతకాన్ని అందించిన మనుభాకర్.. మిక్స్డ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సరబ్జ్యోత్ సింగ్తో కలిసి మరో కాంస్య పతకాన్ని అందుకుంది. తద్వారా ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా సత్తా చాటింది. మరో పతకాన్ని మను భాకర్ తృటిలో కోల్పోయింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ నాలుగో స్థానంలో నిలిచింది.