
న్యూఢిల్లీ: భారత మహిళా స్విమ్మర్ మానా పటేల్కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించింది. యూనివర్సాలిటీ కోటా కింద మానాకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొననుంది. ఈ విషయాన్ని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) శుక్రవారం ధృవీకరించింది. దాంతో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొననున్న తొలి భారత మహిళా స్పిన్నర్గా మానా పటేల్ అరుదైన ఘనతను అందుకోనుంది. అంతేకాకుండా శ్రీహరి నటరాజన్, సజన్ ప్రకాష్ల తర్వాత ఒలింపిక్స్లో పాల్గొనబోయే మూడో భారత స్విమ్మర్ కూడా మానా పటేలే. బెల్గ్రేడ్ వేదికగా ఇటీవల జరిగిన 100 మీటర్ల ఈత పోటీల్లో మానా జాతీయ రికార్డు నెలకొల్పింది.
యూనివర్సాలిటీ కోటా ద్వారా పోటీల్లో సత్తా చాటే ఓ మేల్, ఓ ఫిమేల్ అథ్లెట్ను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, ఒలింపిక్స్కు అర్హత సాధించిన మానా పటేల్ ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు అభినందించారు. 21 ఏళ్ల వయసు గల మానా పటేల్ జాతీయ క్రీడల్లో 50 బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో బంగారు పతకాలు సాధించింది.
మానా పటేల్ 60వ నేషనల్ గేమ్స్ లో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీలో స్వర్ణం సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. 72 వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్షిప్లో మూడు బంగారు పతకాలు సాధించింది. 2018 లో తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్స్లో పటేల్ మూడు బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లను కైవసం చేసుకుంది. 2019లో గాయం తర్వాత ఈ ఏడాదే ఆమె తిరిగి పూల్లో దిగింది.