రెండోసారి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలుస్తానని అస్సలు ఊహించలేదని భారత చెస్ క్వీన్, తెలుగు తేజం కోనేరు హంపి తెలిపింది. ఆటకు వీడ్కోలు పలుకుదామనుకున్న దశ నుంచి వరల్డ్ ఛాంపియన్గా నిలవడం సంతోషంగా ఉందని చెప్పింది. అయితే తన తండ్రి సహకారం వల్లనే రెండో సారి వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచానని పేర్కొంది.
న్యూయార్క్ వేదికగా ఆదివారం ముగిసిన మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 37 ఏళ్ల కోనేరు హంపి విజేతగా నిలిచి విశ్వ చదరంగ వేదికపై మరోసారి భారత పతకాన్ని రెపరెపలాడించిన విషయం తెలిసిందే. 110 మంది ప్లేయర్స్ మధ్య స్విస్ ఫార్మాట్లో 11 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో కోనేరు హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకుంది.

కోనేరు హంపికి ఇది రెండో వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్. 2019లో ఆమె విజేతగా నిలిచింది. 2012లో క్యాంస పతకాన్ని సాధించిన హంపి..గతేడాది సిల్వర్ మెడల్ సాధించింది. తన విజయంపై ఓ ఛానెల్తో మాట్లాడిన కోనేరు హంపి.. తన తండ్రి సహకారంతోనే ఈ టైటిల్ సాధ్యమైందని చెప్పింది.
'వాస్తవానికి ఈ ఏడాది నాకు కలిసి రాలేదు. క్యాండిడేట్స్, నార్వే, టాటా చెస్ సహా ఆడిన అన్ని టోర్నీల్లోనూ నేను విఫలమయ్యాను. మాజీ ఛాంపియన్గా చివరి స్థానాల్లో నిలవడం తట్టుకోలేకపోయాను. దాంతో ఆటను వదిలేయ్యాలనే నిర్ణయానికి వచ్చాను. కానీ నాన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. చిన్నప్పటి నుంచి చెస్ పాఠాలు చెప్పిన ఆయనే మళ్లీ నాకు దారి చూపించాడు.
తప్పిదాలను గుర్తించి సవరించుకునేలా చేశారు. పజిల్స్ చేయించారు. నా ఆలోచన విధానాన్ని మార్చారు. టాటా స్టీల్, వరల్డ్ ఛాంపియన్షిప్ మధ్య నెల రోజు సమయం ఉండటం కలిసొచ్చింది. తక్కువ నిడివితో ఉండే మ్యాచ్లను ఆడించారు. దాంతో మళ్లీ లయను అందుకున్నా.
ఈ టోర్నీ ఫస్ట్ రౌండ్లో ఓటమి ఎదురైనా పట్టు వీడలేదు. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడాను. 112 మంది పోటీ పడినా.. నాది పదో సీడ్. నాకంటే తొమ్మిది మందే అత్యుత్త ప్లేయర్లు ఉన్నారు. నా భర్త, అమ్మ, నాన్న, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ విజయం సాధించాను. 37 ఏళ్ల వయసులో ఏదైనా సాధించాలన్న తపన, ప్రేరణ ఉండటానికి వారి సహకారమే కారణం'అని కోనేరు హంపి చెప్పుకొచ్చారు.