భారత టాప్ చెస్ ప్లేయర్, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025 టోర్నీలో ఫైనల్ చేరిన రెండో భారత ప్లేయర్గా నిలిచింది. సెమీఫైనల్లో చైనాకు చెందిన లీ టింగ్జీపై విజయం సాధించింది. సెమీఫైనల్లో రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగియడంతో విజేతను నిర్ణయించడానికి టై బ్రేక్స్ ఆడాల్సి వచ్చింది. గురువారం జరిగిన టై బ్రేక్స్లో భారత ప్లేయర్ విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. ఇప్పటికే భారత ప్లేయర్ దివ్య దేశ్ముఖ్ ఈ టోర్నీ ఫైనల్ చేరింది. దాంతో ఫైనల్ మ్యాచ్ ఇద్దరి భారత ఆటగాళ్ల మధ్య జరగనుంది. ఎవరు గెలిచినా భారత్ ఖాతాలో తొలి ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ దక్కనుంది.
టై బ్రేక్స్ను వేగవంతమైన ఫార్మాట్లో( ర్యాపిడ్, బ్లిట్జ్) టై బ్రేక్స్ మ్యాచ్లు నిర్వహించగా.. ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. ఈ ఫార్మాట్స్లో ఆటగాళ్లకు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఈ గేమ్స్.. ఆటగాళ్ల వేగవంతమైన ఆలోచన సామర్థ్యంతో పాటు ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యానికి పరీక్షగా నిలుస్తాయి.

ముందుగా 10+10 రాపిడ్ గేమ్స్తో టై బ్రేక్ మొదలైంది. ఈ మ్యాచ్లను కోనేరు హంపి, లీ టింగ్జీ డ్రా చేసుకున్నారు. అనంతరం 5+3 ఫార్మాట్లో ఆడిన రెండో టై బ్రేక్లో తెల్ల పావులతో ఆడిన లీ టింగ్జీ విజయం సాధించింది. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. తప్పక గెలవాల్సిన రెండో గేమ్లో కోనేరు హంపి విజయం సాధించి స్కోర్లను సమం చేశారు. దాంతో ఫలితం తేల్చడానికి బ్లిట్జ్ గేమ్స్ (3+2 ఫార్మాట్) ఆడించాల్సి వచ్చింది.
ఈ బ్లిట్జ్ గేమ్లో కోనేరు హంపి పైచేయి సాధించింది. 3+2 బ్లిట్జ్ ప్రారంభ గేమ్.. 44వ ఎత్తు లీ టింగ్జీ చేసిన తప్పిదాన్ని కోనేరు హంపి సద్వినియోగం చేసుకుంది. రాణి ఆధిక్యాన్ని సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో బ్లిట్జ్ గేమ్లోనూ హంపి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజేతగా నిలిచింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి కోనేరు హంపితో పాటు దివ్య దేశ్ముఖ్లు అర్హత సాధించారు. జులై 26-28 వరకు జరిగే ఫైనల్లో భారత్కే చెందిన దివ్య దేశ్ముఖ్తో కోనేరు హంపి తలపడనుంది.