న్యూఢిల్లీ: సమీప భవిష్యత్లో ఎలాంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దీంతో అక్టోబర్-నవంబర్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ జరిగే అవకాశాలున్నాయని వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. దేశంలో క్రీడల పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నామన్న రిజిజు... అంతకన్నా ముందు ఆట గాళ్ల ప్రాక్టీస్, శిక్షణ, ఫిట్నెస్ తమకు ముఖ్యమని పేర్కొన్నారు. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే క్రీడా ఈవెంట్లు నిర్వహించేందుకు అలవాటు పడాలని సూచించారు.
'క్రీడల పునరద్దరణ కోసం మేం కొంత కాలం నుంచి కసరత్తులు చేస్తున్నాం. అంతకంటే ముందు ప్రాక్టీస్, ట్రైనింగ్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో ఎలాంటి టోర్నమెంట్లు ఉండవు. ఇకపై క్రీడా ఈవెంట్లన్నిటినీ ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. ఆ పరిస్థితికి మనం అలవాటు పడక తప్పదు'అని శనివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే ఆ విండో(అక్టోబర్-నవంబర్)లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో రిజిజు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఐపీఎల్ గురించి మాట్లాడిన మంత్రి.. దేశంలో ఎెలాంటి టోర్నమెంట్ జరగాలన్నా దానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అన్నారు.
'టోర్నమెంట్ల విషయంలో మన దగ్గర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. మున్ముందు పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం ఉంటుంది. అయితే, ఓ క్రీడా ఈవెంట్ కోసం మేం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టం. ఇప్పటికైతే మా దృష్టంతా కరోనా పోరాటంపైనే ఉంది. అదే సమయంలో దేశాన్ని మళ్లీ సాధారణ స్థితిలోకి తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. ఫలానా తేదీలను కచ్చితంగా చెప్పలేను గానీ ఈ ఏడాది మనదేశంలో కొన్ని రకాల స్పోర్టింగ్ ఈవెంట్లు జరుగుతాయి.'అని రిజిజు చెప్పుకొచ్చారు. లాక్డౌన్ కారణంగా అథ్లెట్లు ఇళ్లకే పరిమితమైనప్పటికీ.. వాళ్ల ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నామని రిజిజు తెలిపారు. కోచ్లు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్, హై పెర్ఫామెన్స్ డైరెక్టర్లు వారితో టచ్లో ఉన్నారని చెప్పారు.
ధోనీ కన్నా బెటర్ హెలికాఫ్టర్ షాట్ను కనుగొన్నాం.. ఆకాశ్ చోప్రాపై మండిపడుతున్న ఫాన్స్!!