ఖోఖో ప్రపంచ కప్ 2025లో ఆతిథ్య భారత్ జోరు కొనసాగుతోంది. అటు మహిళల జట్టు.. ఇటు పురుషుల టీమ్ అప్రతిహత విజయాలతో అదరగొడుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు క్వార్టర్ఫైనల్లో చోటు దక్కించుకోగా.. గురువారం గ్రూపు మ్యాచ్లను విజయంతో ముగించాయి. గ్రూప్-ఎలో తలపడుతున్న మహిళల జట్టు తమ ఆఖరి పోరులో 100-20 పాయింట్ల తేడాతో మలేసియా జట్టును చిత్తు చేసింది. నాలుగు టర్న్ల్లో భారత మహిళల జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఇరాన్, మలేసియా, సౌత్ కొరియాతో కూడిన గ్రూప్-ఎలో భారత మహిళల జట్టు అగ్రస్థానంలో నిలిచింది. నేడు(శుక్రవారం) జరిగే క్వార్టర్ఫైనల్లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో భారత మహిళల జట్టు తలపడనుంది.

భూటాన్పై ఘన విజయం..
ఇక.. భారత పురుషుల జట్టు తిరుగులేని ప్రదర్శన చేసింది. గ్రూప్-ఎ చివరి మ్యాచ్లో 71-34 పాయింట్ల తేడాతో భూటాన్ను చిత్తు చేసింది. బ్రెజిల్, పెరూ, నేపాల్, భూటాన్తో కూడిన గ్రూప్-ఏలో భారత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి టాప్లో నిలిచింది. నేడు(శుక్రవారం) జరిగే క్వార్టర్ఫైనల్లో శ్రీలంక జట్టును భారత పురుషులు ఎదుర్కొంటారు.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ఖోఖో ప్రపంచ కప్ 2025కు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తున్నాయి. ఈ వేదికలుగా మ్యాచ్ చూడాలంటే వాటిని సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఖో ఖో మ్యాచ్లను ఫ్రీగా చూడాలంటే.. డీడీ స్పోర్ట్స్లో చూడవచ్చు. ఖో ఖో గేమ్కు ఆదరణ కలిగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం డీడీ స్పోర్ట్స్ సాయంతో ఈ మ్యాచ్లను ఉచితంగా ప్రసారం చేస్తోంది. క్వార్టర్ ఫైనల్స్లో మహిళల మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. పురుషుల మ్యాచ్ రాత్రి 8.15 గంటలకు ప్రారంభం కానుంది.