లడఖ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026లో తెలంగాణ క్రీడాకారిణి నయనా శ్రీ తల్లూరి తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మంచు పలకలపై మెరుపు వేగంతో దూసుకెళ్తూ వరుసగా రెండో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుని తెలంగాణ సత్తాను చాటింది.
లడఖ్లోని ఎన్.డి.ఎస్ (NDS) స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన షార్ట్ కోర్స్ ఐస్ స్కేటింగ్ పోటీల్లో తెలంగాణ వండర్ కిడ్ నయనా శ్రీ తల్లూరి అద్భుత ప్రదర్శన చేసింది. 1000 మీటర్ల షార్ట్ ట్రాక్ విభాగంలో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ప్రస్తుత వింటర్ గేమ్స్లో రెండు వ్యక్తిగత స్వర్ణాలు గెలిచిన మూడో స్కేటర్గా నయనా రికార్డు సృష్టించింది.

కెనడాలోని కాల్గరీలో శిక్షణ పొందుతున్న నయనా శ్రీ, ఈ రేసును చాలా వ్యూహాత్మకంగా ఆరంభించింది. మొదట్లో సాధారణ వేగంతో వెళ్లినప్పటికీ, రేసు మధ్యలో ఒక్కసారిగా గేర్ మార్చి వేగాన్ని పెంచింది.
దీంతో మహారాష్ట్రకు చెందిన అన్వయి దేశ్పాండే నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, నయనా కేవలం 1:43.32 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచింది. అన్వయి దేశ్పాండే (1:43.43) వెండి, షాలీన్ ఫెర్నాండెజ్ (1:46.41) కాంస్యం సాధించారు.
నయనా శ్రీకి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అచ్చొచ్చిన వేదిక. శనివారం జరిగిన 500 మీటర్ల షార్ట్ ట్రాక్ విభాగంలో కూడా ఆమె స్వర్ణం గెలిచింది. విశేషమేమిటంటే, 500 మీటర్ల విభాగంలో ఆమెకు ఇది వరుసగా నాలుగో ఏడాది స్వర్ణ పతకం కావడం గమనార్హం. ప్రస్తుతం కెనడాలో ఉన్నత స్థాయి శిక్షణ పొందుతున్న ఆమె, కేవలం ఈ పోటీల కోసమే లేహ్కు చేరుకుంది.
ఆదివారం పురుషుల 1000 మీటర్ల షార్ట్ ట్రాక్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన ఇషాన్ దార్వేకర్ (1:35.57) తన తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. కాగా, ఇదే ఈవెంట్లో తెలంగాణ స్కేటర్లు ముత్తకాని విష్ణు వర్ధన్ (రజతం), డి. శివ మణికంఠ (కాంస్యం) రాణించడంతో తెలంగాణ పతకాల పట్టికలో దూసుకుపోతోంది.
ప్రస్తుతం పతకాల పట్టికలో హర్యానా 4 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉండగా, లడఖ్ రెండో స్థానంలో ఉంది. తెలంగాణ కూడా రెండు స్వర్ణాలతో గట్టి పోటీనిస్తోంది. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరగనున్న ఐస్ హాకీ ఫైనల్స్తో ఈ క్రీడలు ముగియనున్నాయి