మంచు కొండల నడుమ, గడ్డకట్టే చలిలో క్రీడా నిప్పుకణికలు మెరిశాయి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ (KIWG) 6వ ఎడిషన్కు లడఖ్లోని నవాంగ్ డోర్జన్ స్టోబ్డాన్ (NDS) స్టేడియం మంగళవారం వేదికైంది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ వరుసగా మూడవసారి ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం.
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. సంప్రదాయ సంగీతం, నృత్య రూపకాలతో ప్రారంభోత్సవ వేడుకలు కనువిందు చేశాయి. ఈ సందర్భంగా ఆర్మీ ఎలెవన్, యూటీ లడఖ్ జట్ల మధ్య జరిగిన ప్రదర్శన ఐస్ హాకీ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ లడఖ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 'ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశంలో శీతాకాల క్రీడల భవిష్యత్తు హిమాలయాల నుంచి మొదలవుతోంది. వింటర్ గేమ్స్ ఇప్పుడు భారత క్రీడా వ్యవస్థలో అంతర్భాగమయ్యాయి. ఈసారి క్రీడలను రెండు విభాగాలుగా (లడఖ్లో ఐస్ స్పోర్ట్స్, గుల్మార్గ్లో స్నో స్పోర్ట్స్) నిర్వహించడం ద్వారా అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం లభిస్తుంది," అని ఆయన పేర్కొన్నారు.
క్రీడల అభివృద్ధికి లడఖ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎల్జీ కవీందర్ గుప్తా కొనియాడారు. లడఖ్ సొంతంగా క్రీడా విధానాన్ని రూపొందించుకుందని, ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్, స్కాలర్షిప్లు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ వేడుకలో లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (కార్గిల్) సీఈసీ డాక్టర్ మొహమ్మద్ జాఫర్ అఖూన్, చీఫ్ సెక్రటరీ ఆశిష్ కుంద్రా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి