దేశవ్యాప్తంగా ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తామని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా.. వాస్తవం మాత్రం మరోలా ఉంది. బడ్జెట్లో కోట్ల రూపాయాలను క్రీడలకు కేటాయిస్తున్నా.. అవి పేపర్లకే పరిమితమవుతున్నాయి. క్రీడా రాజకీయాల కారణంగా నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లకు ఒక్క రూపాయి కూడా అందడం లేదు. జార్ఖండ్కు చెందిన పూర్ణిమా లిండానే ఇందుకు పెద్ద ఉదాహరణ. చైనా వేదికగా జరిగిన చైనీస్ మార్షల్ ఆర్ట్ వరల్డ్ కుంగ్ఫూ ఛాంపియన్షిప్లో కాంస్య గెలిచినా పూర్ణిమా లిండాను ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఆమె సాధించిన విషయాన్నే ఎవరూ గుర్తించలేదు.
ఈ క్రమంలోనే ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విదేశాల్లో భారత జెండా పట్టుకుంటే తనకు సంతోషమేనని, కానీ తన జీవితం ముందుకు సాగడమే కష్టమని భావోద్వేగానికి గురైంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని విజయాలు సాధించినా తనకు కనీస గుర్తింపు దక్కలేదని, ఉద్యోగం కూడా రాలేదని కన్నీటి పర్యంతమైంది.

జార్ఖండ్, రాంచీ సమీపంలోని కంకే గ్రామినికి చెందిన ఆదివాసీ ఒరాన్ తెగకు చెందిన పూర్ణిమా లిండా ఆగస్ట్లో చైనీస్ మార్షల్ ఆర్ట్ వరల్డ్ కుంగ్ఫూ ఛాంపియన్షిప్కు అర్హత సాధించింది. ఆ సమయంలో ఆమె ఎగిరి గంతేసింది. కానీ ఆ టోర్నీలో పాల్గొనేందుకు కావాల్సిన డబ్బులు లేకపోవడం తీవ్ర నిరాశకు గురైంది. నిరుపేద కుటుంబం, ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న ఆమెకు గ్రామస్థులు, సహచర వుషు క్రీడాకారులు సాముహిక విరాళాలతో రూ. 1.5 లక్షలు సేకరించి పూర్ణిమా లిండాకు అండగా నిలిచారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్న లిండా.. ఈ పోటీలో రెండు కాంస్య పతకాలు సాధించింది.
అక్టోబర్ 14 నుంచి 20 వరకు జరిగిన ఈ వరల్డ్ కుంగ్ఫూ ఛాంపియన్షిప్లో 54 దేశాల క్రీడాకారులు బరిలోకి దిగారు. భారత్ నుంచి 20 మంది అథ్లెట్లు పాల్గొనగా.. అందులో 30 ఏళ్ల పూర్ణిమ ఒకరు. 2007లో లక్నో వేదికగా జరిగిన ఇదే టోర్నీలో సిల్వర్ మెడల్ గెలిచిన పూర్ణిమ.. 2023లో రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన పోటీల్లో కాంస్య పతకం సాధించింది. తాజా టోర్నీలో స్వార్డ్ ప్లే, బేర్ హాండెడ్ రొటిన్స్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు అందుకుంది.
పూర్ణిమ లిండా తల్లి అంగన్ వాడీ కార్యకర్త కాగా.. తండ్రి రోజువారీ కూలి. ఐదేళ్ల వయసులోనే తన గ్రామంలోని మిషనీ స్కూల్లో నన్స్ ప్రోత్సాహంతో వుషు ఆటను ఆడటం ప్రారంభించింది. సాండా విభాగంలో ప్రాక్టీస్ చేసి నాలుగో తరగతిలో చండీగఢ్ వేదికగా జరిగిన పోటీల్లో గెలిచి తొలి జాతీయ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆ విజయానికి బహుమతిగా ఆమెకు రూ. 10 వేల నగదు పురస్కారం లభించింది. 50 జాతీయ టైటిళ్లతో పాటు సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత 2023లో Taolu విభాగానికి మారింది. ఈ కేటగిరిలో ఎక్కువ అవకాశాలు వస్తాయని ఇలా చేసింది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను ఎలాంటి ప్రత్యేకమైన ఆహారం తీసుకోలేదని, సాధారణ గ్రామీణ జీవనం ద్వారానే తన బలాన్ని పెంచుకున్నానని తెలిపింది. చైనాలో కాంస్య పతకం గెలిచిన తర్వాత తనకు సరైన స్వాగతం కూడా లభించలేదని, ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్వగ్రామంలో కొందరు తనకు స్వాగతం పలికారని, మీడియా, రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది. స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఇంటికి పిలిచి సత్కారం చేశాడని పేర్కొంది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని స్పష్టం చేసింది.
చైనాలో క్రీడాకారులను చాలా గౌరవిస్తారని, ప్రతీ ప్లేయర్కు వ్యక్తిగత కోచ్ ఉంటారని ఆమె తెలిపింది. అంగన్వాడీ టీచర్ అయిన తన తల్లి వచ్చే రూ. 4000 జీతంతోనే కుటుంబం గడుస్తుందని, తన తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించిందని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. భారత్కు ప్రాతినిథ్యం తనకు సంతోషమేనని, కానీ ఇప్పటికీ ఉద్యోగమే రాలేదని బాధపడింది.