భారత మహిళా జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ అథ్లెట్ అన్ను రాణి చిక్కుల్లో పడింది. ఆమెతో పాటు భర్త, దేశవాళీ కిక్బాక్సింగ్ ఛాంపియన్ సహిల్ భరద్వాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి వివాహ వేడుక సందర్భంగా తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత మంగళవారం ఉత్తరప్రదేశ్, మీరట్లో అన్నురాణి, సహిల్ భరద్వాజ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో దండలు మార్చుకునే కార్యక్రమం సందర్భంగా అన్ను రాణి, సాహిల్ భరద్వాజ్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు వారిపై ఆర్మ్స్ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వివాహ వేడుకల్లో గాల్లో కాల్పులు జరపడం సర్వ సాధారణమే. కానీ ఇది చట్ట విరుద్దం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

క్రీడా ప్రముఖులు హాజరైన ఈ వివాహ వేడుకల్లో ఈ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అన్ను రాణి, సాహిల్ భరద్వాజ్పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై మైఖేల్ ప్రతినిధులు పోలీసు ఉన్నతధికారులను సంప్రదించగా.. ఎఫ్ఐఆర్ నమోదు చెసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 'ఈ ఘటనపై మేం దర్యాప్తు చేస్తున్నాం. అన్నురాణితో పాటు ఆమె భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.'అని ఓ పోలీస్ ఉన్నతధికారి పేర్కొన్నారు.
భారత టాప్ జావెలిన్ త్రోయర్ అయిన అన్ను రాణి ఆసియా గేమ్స్ 2023లో స్వర్ణ పతకం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ గెలవడంతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2019లో ఫైనల్కు అర్హత సాధించిన తొలి జావెలిన్ ప్లేయర్గా నిలిచింది. టోక్యో, పారిస్ ఒలింపిక్స్లోనూ బరిలోకి దిగింది. ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గతేడాది అర్జున అవార్డ్తో సత్కరించింది.