వాస్కో: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో ఏటీకే మోహన్ బగాన్ కీలక విజయాన్నందుకుంది. గత మ్యాచ్ ఓటమి నుంచి ఆ జట్టు త్వరగానే తేరుకుంది. చివరి నిమిషం వరకు బంతిపై పట్టు సడలకుండా ఆడటంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఏటీకే మోహన్ బగాన్ 4-1తో ఒడిశా ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. ప్రారంభం నుంచే ఏటీకే అటాకింగ్ మొదలుపెట్టింది. బంతిని ఆధీనంలో ఉంచుకుంటూ ప్రత్యర్థి సర్కిల్పై దాడులు చేసింది. ఈ క్రమంలో ఏటీకే తరఫున మన్వీర్(11, 54వ నిమిషం), కృష్ణ(83, 86వ నిమిషం) గోల్స్ చేశారు. అలెగ్జాండర్(45వ నిమిషం) ఒడిశాకు ఏకైక గోల్ అందించాడు.
మ్యాచ్ ప్రారంభమైన 11వ నిమిషంలోనే సహచర ఆటగాడి పాస్ను గోల్గా మలిచిన మన్వీర్ ఏటీకే ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఒడిశా ధీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో 45వ నిమిషంలో అలెగ్జాండర్ గోల్ సాధించడంతో ఫస్టాఫ్ 1-1తో ముగిసింది. సెకండాఫ్ ఫ్రారంభంలోనే మన్వీర్(54వ నిమిషం) మరో గోల్ కొట్టడంతో ఏటీకే ఆధిక్యం 2-1గా మారింది. ఆ తర్వాత మరింత ఉత్సాహంగా ఆడిన ఏటీకే ప్లేయర్లు.. ప్రత్యర్థి సర్కిల్లోకి పదే పదే దూసుకెళ్లారు.
ఈ క్రమంలో 83, 86వ నిమిషంలో కృష్ణ వరుసగా రెండు గోల్స్ సాధించడంతో ఏటీకే 4-1 ఆధిక్యం ట్రిపుల్ అయింది. ఆ తర్వాత ఒడిశా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాజా విజయంతో ఏటీకే మోహన్ బగాన్ 30 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్కు మరింత చేరువైంది. మ్యాచ్ల సంఖ్య పెరిగినా వరుస ఓటములతో ఒడిశా(8) ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.