
టెహ్రాన్: ఇరాన్ డిస్కస్ త్రో ప్లేయర్ ఇహ్సాన్ హడాడికి కరోనా వైరస్ సోకింది. ఈ ప్రాణాంతక వైరస్ లక్షణాలతో బాధపడుతుండటంతో అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలంది. ప్రస్తుతం అతడు స్వీయ నిర్బంధంలో ఉన్నాడని ఇరాన్ అథ్లెట్ ఫెడరేషన్ వైద్యుడు అష్కాన్ మీడియాకు తెలిపారు.
'ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని రావడంతో ఒలింపిక్స్ రజత పతక విజేత స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు'' అని అష్కాన్ పేర్కొన్నారు.
2012 లండన్ ఒలింపిక్స్లో ఇహ్సాన్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఇక 2011 ప్రపంచ ఛాంపియన్షిప్స్లోనూ బ్రాంజ్ మెడల్ నెగ్గాడు. రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్, తైక్వాండో విభాగాల్లో మినహా ఇరాన్ తరఫున తొలి పతకాన్ని సాధించిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. మహమ్మారి కరోనా ధాటికి ఇరాన్ విలవిలలాడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో 2,500 మందికి పైగా కరోనా బలితీసుకుంది. కరోనా ఎవరిని విడిచిపెట్టదని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని వైద్యులు సూచిస్తున్నారు.