
టోక్యో: ఒలింపిక్స్ నిర్వహణపై జపాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ ఆపబోమని ఈ సమ్మర్ గేమ్స్ నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే గతేడాది జరగాల్సిన ఈ మెగా ఈవెంట్.. కరోనా కారణంగా 2021కి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. జపాన్లో కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా ఒలింపిక్స్ నిర్వహించకూడదని అక్కడి ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 60 శాతం మంది ప్రజలు ఈ మెగా ఈ ఈవెంట్ను వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఈ ఏడాది కూడా టోక్యో ఒలింపిక్స్ జరగడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ షెడ్యూల్ ప్రకారం సమ్మర్ గేమ్స్ నిర్వహించి తీరుతామంటుంది. 'ప్రజల మాట వింటాం. కానీ, వారు చెప్పిందే అంతిమ నిర్ణయం కాదు' అని ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ సభ్యుడు మార్క్ ఆడమ్స్ అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ తప్పక జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల్లో మెగా ఈవెంట్ నిర్వహణ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, ఈవెంట్ ప్రారంభసమయానికి పరిస్థితులన్నీ చక్కబడుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పుడు ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణ పట్ల వారే గర్వంగా ఫీలవుతారని తెలిపాడు. ఇక ఒలింపిక్స్ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం టోక్యోలో ఎమర్జెన్సీ ప్రకటించింది. దాంతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్ జపాన్ పర్యటన రద్దైంది.
మరోవైపు టెన్నిస్ స్టార్ ప్లేయర్లు సెరెనా విలియమ్స్, నవోమి ఒసాకా, కెయి నిషికోరి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ టోర్నమెంట్ నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్కు దాదాపు 10,000 మంది అథ్లెట్లు, సిబ్బంది హాజరవుతారని, వీరందరికీ బయో బబుల్ నిర్వహణ సాధ్యమేనా? అని ప్రశ్నించారు. ఇక ఓ అథ్లెట్గా ఒలింపిక్స్ జరగాలనుకుంటానని, కానీ జపాన్ దేశస్థురాలిగా మాత్రం వ్యతిరేకిస్తానని ఓసాకా తెలిపింది.
జపాన్లో గత 10 రోజుల్లో 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, స్థానిక నిర్వాహకులు ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తారనే నమ్మకం తనకు లేదని జపాన్కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నిషికోరి అన్నారు. ఇది వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడమేనని, జపాన్లోని అనేక నగరాలు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ఒలింపిక్స్ నిర్వహించడం భావ్యం కాదన్నాడు.
కాగా, తన కుమార్తెను వెంట తీసుకురావడానికి సెరెనా విలియమ్స్ అనుమతి కోరక ముందే నిర్వాహకుల తీరును తీవ్రంగా ప్రశ్నించింది. తన మూడేండ్ల కుమార్తెను తీసుకెళ్లడానికి అనుమతించకపోతే టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేది లేదని సెరెనా కరాఖండిగా తెలిపింది. 'నా కుమార్తె లేకుండా నేను ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా గడపలేదు. ఈ సమయంలో కుమార్తెను ఒంటరిగా వదిలి రావాలంటే చాలా కష్టం. అయినా కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో బయో బబుల్ ఎలా నిర్వహిస్తారు' అని ఆమె ప్రశ్నించారు. ఒలింపిక్స్ మహా సంబరానికి ఇంకో 70 రోజులు మాత్రమే సమయం మిగిలుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగాల్సి ఉంది.