న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి మెడల్ అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను కోచ్ విజయ్ శర్మకు రూ.10 లక్షల నగదు బహుమతి దక్కనుంది. టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన అథ్లెట్ కోచ్లకు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించింది. బంగారు పతకం సాధించే అథ్లెట్ కోచ్కు రూ.12.5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించే అథ్లెట్ కోచ్కు రూ.10 లక్షలు, కాంస్య పతకం విజేత అథ్లెట్ కోచ్కు రూ. 7.5 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
కాగా, టోక్యో ఒలింపిక్స్ రెండో రోజు మహిళల వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన హౌ జిహోయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న మీరాబాయి స్నాచ్లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్లో మొదటి అవకాశంలో 84 కిలోలు ఎత్తిన ఆమె.. రెండోసారి 87 కిలోలు ఎత్తింది. అంతకన్నా ఎక్కువ ఎత్తాలన్న ఉద్దేశంతో మూడోసారి 89 కిలోలు ప్రయత్నించి విఫలమైంది.
ఇక క్లీన్ అండ్ జర్క్లో అద్భుతమే చేసింది. మొదట 110 కిలోలను అలవోకగా ఎత్తింది. అయితే కాంస్యం గెలిచిన విండీ కాంటిక క్లీన్ అండ్ జర్క్లో ఎత్తిన అత్యధిక బరువు 110 మాత్రమే. దాంతో మీరాకు పతకం ఖాయమని అర్థమైపోయింది. రెండో అవకాశంలో 115 కిలోలు ఎత్తి రజతం ఖాయం చేసుకుంది. స్వర్ణం రాదని తెలిసినా.. మెరుగైన రికార్డు కోసం 117 కిలోలు ప్రయత్నించి విఫలమైంది.
ఆమె విజయంతో కోచ్ విజయ్ శర్మకు రూ.10 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మెడల్స్ తెచ్చే అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే వారికి ఇచ్చే నగదు బహుమతి వారి మనోధైర్యాన్ని పెంచడంతోపాటు ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు.
అంతకుముందు అథ్లెట్లకు కూడా నగదు పురస్కారం అందజేస్తామని తెలిపింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ లెక్కన చానుకు రూ.40 లక్షల నగదు పురస్కారం లభించనుంది.