జకార్త: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ టాప్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జోరు కొనసాగుతోంది. సంచలన ఆట తీరుతో ఈ భారత ద్వయం ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్లో ఏడో సీడ్ ద్వయం సాత్విక్-చిరాగ్ 17-21, 21-19, 21-18 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన ఎం.హెచ్. కాంగ్-ఎస్.జే. సియో జోడీపై విజయం సాధించారు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత ద్వయం తొలి గేమ్లో ఓడినా.. తర్వాతి రెండు గేమ్స్లో అద్వితీయమైన ప్రదర్శనతో విజయాన్నందుకున్నారు. దక్షిణ కొరియా ద్వయం కూడా ధీటుగా బదులిచ్చినా.. ఏ మాత్రం తప్పిదం చేయని సాత్విక్-చిరాగ్ తిరుగులేని బేస్లైన్ గేమ్తో పాటు సుదీర్ఘమైన ర్యాలీలతో విజయాన్నందుకున్నారు.

ఈ విజయంతో సూపర్ 1000 టోర్నమెంట్ ఫైనల్కు చేరిన మొదటి భారత జోడీగా రికార్డు సృష్టించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో సాత్విక్-చిరాగ్ 21-13, 21-13తో ఇండోనేసియాకు చెందిన టాప్సీడ్ జంట ఫజర్ అల్ఫియాన్-మహ్మద్ రియాన్ను వరుసగేముల్లో ఓడించి ఇంటికి పంపింది. ఆరంభం నుంచే దీటుగా ఆడిన భారత జోడీ కేవలం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థి జోడీని మట్టికరిపించింది.
మరోవైపు, పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్కు నిరాశే ఎదురైంది. డెన్మార్క్కు చెందిన టాప్ సీడ్ అక్సెల్సెన్ 21-15, 21-15 తేడాతో ఏడో సీడ్ ప్రణయ్ను మట్టికరిపించాడు. అక్సెల్సెన్ ఫైనల్లో లీ షిఫెంగ్ (చైనా) లేదా ఆంథోనీ సినిసుకా గింటింగ్ (ఇండోనేసియా)తో తలపడనున్నాడు.
ప్రణయ్ క్వార్టర్స్లో 21-18, 21-16 తేడాతో మూడో సీడ్ కొడాయ్ నరోకా (జపాన్)పై విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
స్టార్ షట్లర్ పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ కనీసం సెమీఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.