న్యూఢిల్లీ: ప్రతీవారం ప్రజల మన్కీ బాత్ వినే భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ గోస కూడా వినాలని స్టార్ రెజ్లర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని, అతనిపై కమిటీ విచారణ నివేదికను బహిర్గతం చేయాలనే డిమాండ్లతో జంతర్మంతర్ వద్ద స్టార్ రెజ్లర్లు, ఒలింపిక్ విజేతలు ధర్నాను కొనసాగిస్తున్నారు.
ఇంత ఆందోళన చేస్తున్నా ప్రధాని తమ బాధను పట్టించుకోకపోవడంపై రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 'మోదీ సర్ 'బేటీ బచావో', 'బేటీ పడావో' అనే నినాదం ఇచ్చారు. ప్రతి ఒక్కరి 'మన్కీ బాత్' వింటారు. ఆయన మా 'మన్కీ బాత్' వినలేరా? మేం పతకాలు గెలిచినప్పుడు ఇంటికి పిలిపించి ఎంతో గౌరవిస్తారు. మమ్మల్ని ఆయన కూతుళ్లమని అక్కున చేర్చుకొని ప్రశంసలు కురిపిస్తారు. ఇప్పుడు మా 'మన్కీ బాత్' వినాలని ఆయన్ని కోరుతున్నాం. మా నిజం ఆయనకు చేరడం లేదేమో. అందుకే ప్రధానిని కలిసి మా సమస్యలు చెప్పాలనుకుంటున్నాం.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. మేం నాలుగు రోజులుగా రోడ్డుపై నిద్రిస్తున్నాం. ఆహారం వండుకోవడానికి, శిక్షణ కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. స్మృతి ఇరానీ ఎందుకు మాట్లాడడం లేదు? మా దగ్గరకు వచ్చి మా గోస వినండి. మాకు మద్దతునివ్వండి'' అని స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ విజ్ఞప్తి చేసింది
దేశ ప్రధానితో నేరుగా మాట్లాడేందుకు కావాల్సిన ఫోన్ నంబర్లు తమ దగ్గర లేవని, అందుకే మీడియా ద్వారా తమ సమస్యలను మొర పెట్టుకుంటున్నామని వినేశ్ ఫొగాట్ భావోద్వేగానికి గురైంది. పెద్ద నేరస్థుడిపై పోరాటంలో దేశ ఆడబిడ్డలమైన మేము ఇలా రోడ్డుపైన కూర్చున్నామని, రెజ్లింగ్ను వదులుకునే ప్రమాదంలో పడ్డామని ప్రధాని తెలియదా? అని ప్రశ్నించారు.
రెజ్లింగ్ ప్రాక్టీస్ కొనసాగించేందుకు మ్యాట్లు తెచ్చుకున్నామని, కానీ పోలీసులు అనుమతించడం లేదని,. ఊపిరి తీసుకోవడానికి కూడా అనుమతి కావాలేమోనని బజ్రంగ్ పూనియా అసహనం వ్యక్తం చేశాడు.
మరోవైపు ప్రాథమిక విచారణ పూర్తి చేయాల్సి ఉండటంతోనే డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సుప్రీం కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బ్రిజ్ భూషణ్పై గత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.