|
అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్లోని బర్మింగ్ హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన రెజ్లింగ్ ట్రయల్స్ను ఢిల్లీ వేదికగా భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్వహిస్తోంది. ఈ పొటీల్లో భాగంగా మంగళవారం పురుషుల 125 కేజీల విభాగంలో ఫైనల్ మ్యాచ్ను నిర్వహించారు. ఈ పోటీలో మోహిత్ చేతిలో సర్వీసెస్ జట్టుకు ఆడుతున్న సతేందర్ మాలిక్ ఓడిపోయాడు. దీంతో కామన్వెల్త్ క్రీడలకు అతను అర్హత సాధించలేకపోయాడు.
|
3-0తో ఆధిక్యంలో నిలిచి..
అయితే ఈ పోరులో ఒక దశలో సతేందర్ మాలిక్ 3-0తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ప్రత్యర్థి మోహిత్ తన బలాన్నంతా ఉపయోగించి సతేందర్ను మ్యాట్ బయటికి నెట్టేశాడు. అయినప్పటికీ మోహిత్కు రిఫరీ ఒక పాయింట్ మాత్రమే కేటాయించాడు. దాంతో మోహిత్ రివ్యూ కోరాడు. జ్యూరీ సభ్యుడిగా ఉన్న సత్యదేవ్ మాలిక్ స్పందిస్తూ... ''తాను, సతేందర్ మాలిక్ ఒకే గ్రామానికి చెందినవారమని, తాను తీసుకునే నిర్ణయం అతడికి అనుకూలంగా ఉంటే పక్షపాత ధోరణి చూపించారని అంటారు.. అందుకే జ్యూరీ నుంచి తప్పుకుంటున్నట్టు''ప్రకటించాడు.
|
వ్యతిరేకంగా పాయింట్స్ ఇవ్వడంతో..
దీంతో మోహిత్ రివ్యూను పరిశీలించే బాధ్యతను సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్కు అప్పగించారు. వీడియో ఫుటేజి పరిశీలించిన జగ్బీర్ సింగ్... మోహిత్ కు ఏకంగా మూడు పాయింట్లు కేటాయించాడు. ఓడిపోతాడనుకున్న మోహిత్ కాస్తా 3-3తో మళ్లీ రేసులోకి వచ్చాడు. ఆ తర్వాత సతేందర్ మాలిక్పై పై చేయి సాధించి విజయాన్నందుకున్నాడు. ఈ బౌట్ ఫలితంతో సతేందర్ మాలిక్ రగిలిపోయాడు. తాను గెలవాల్సిన మ్యాచ్... సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్ కారణంగా ఓడిపోయానని ఆగ్రహం పెంచుకుకున్నాడు. కోపాన్ని అదుపు చేసుకోలేక జగ్బీర్ సింగ్పై దాడి చేశాడు.
|
కోపాన్ని అదుపు చేసుకోలేక..
అతని ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఆ సమయంలో జగ్బీర్ సింగ్ 57 కేజీల విభాగంలో మరో బౌట్ కు రిఫరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నేరుగా మ్యాట్ పైకి వెళ్లిన సతేందర్ మాలిక్.... జగ్బీర్ తో గొడవకు దిగాడు. ఆ తర్వాత అతని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చాడు. ఆ దెబ్బకు రిఫరీ జగ్బీర్ సింగ్ మ్యాట్ పై పడిపోయాడు. ఈ ఘటనతో ఆ ఇండోర్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న డబ్ల్యూఎఫ్ఐ అధికారులు సతేందర్ మాలిక్ ను అక్కడి నుంచి పంపేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఈ గొడవను డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ చూసాడు. ఇక రిఫరీపై దాడి ఘటనను సిరీయస్గా తీసుకున్న రెజ్లింగ్ సమాఖ్య.. సతేందర్ మాలిక్ పై జీవితకాల నిషేధం విధించింది. ఈ మేరకు డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ ప్రకటించారు.