
న్యూఢిల్లీ: భారత నావీ ఉద్యోగి, ఏస్ అథ్లెట్ ఎంపీ జబీర్ ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. 400 మీటర్ల హర్డిల్స్లో భారత్ తరఫున బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్న ఎంపీ జబీర్.. తద్వారా ఒలింపిక్స్లో ఈ కేటగిరీలో బరిలోకి దిగనున్న తొలి భారత పురుష అథ్లెట్గా అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నాడు. ఇప్పటి వరకు ఏ పురుష అథ్లెట్ కూడా ఒలింపిక్స్లో ఈ ఈవెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించలేదు.
ఇటీవల పటియాల వేదికగా జరిగిన అంతరాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 400 మీటర్ల హర్డిల్స్ కేటగిరీలో 49.78 సెకన్ల టైమ్తో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న జబీర్.. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా టోక్యో బెర్త్ దక్కించుకున్నాడు. వాస్తవానికి ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ మార్క్ అందుకోకపోయినా.. మెరుగైన ర్యాంక్తో ఆటోమెటిక్ కోటా ద్వారా అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ 400 మీటర్ల హర్డిల్స్లో మొత్తం 40 మంది అథ్లెట్లు పోటీ పడనుండగా.. ఇంకా 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
దాంతో 34వ ర్యాంకులో ఉన్న ఈ కేరళ అథ్లెట్ నేరుగా అర్హత సాధించాడు. కేరళ నుంచే దూసుకొచ్చిన పరుగుల రాణి పీటీ ఉష తర్వాత 400 మీటర్ల హర్డిల్స్లో పోటీ పడుతున్న రెండో కేరళ ప్లేయర్గా కూడా జబీర్ గుర్తింపు పొందనున్నాడు.లాస్ ఎంజెల్స్ ఒలింపిక్స్లో పీటీ ఉష ఈ కేటగిరీలో పోటీ పడింది.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో జబీర్ పోటీ పడ్డాడు. కరోనా కారణంగా టోర్నీలన్నీ రద్దయినా.. నావీ టీమ్ సాయంతో సమ్మర్ గేమ్స్కు సిద్దమయ్యాడు. జబీర్తో పాటు జావెలిన్ త్రోయర్ అను రాణి, స్ప్రింటర్ ద్యుతీ చంద్ 100, 200 మీటర్ల విభాగంలో క్వాలిఫికేషన్ మార్క్తో సంబంధం లేకుండా ఒలింపిక్ బెర్త్లు దక్కించుకున్నారు.
ఇక జూలై 28 నుంచి జపాన్లోని టోక్యో వేదికగా ఈ సమ్మర్ గేమ్స్కు తెరలేవనుంది. వరల్డ్ ర్యాకింగ్స్ ద్వారా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత అథ్లెట్లను కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే సమ్మర్ గేమ్స్లో భారత ఆటగాళ్లు సత్తాచాటుతారని ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ధీమా వ్యక్తం చేశారు.