న్యూయార్క్: అమెరికాలో ఓ పోలీసు కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే స్టార్ క్రీడాకారులు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. జాత్యంహంకారానికి వ్యతిరేకంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరిట జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. క్రికెటర్లు, ఫుట్బాలర్లు తమ జెర్సీలపై బ్లాక్ లైవ్స్ మ్యాటర్ లోగో ముద్రించుకొని బరిలోకి దిగగా.. ఎఫ్1 రేసర్ హామిల్టన్ నలుపు కార్లతో పోటీపడ్డాడు.
ఇక అమెరికాలోని కాన్సాస్ యూనివర్సీటీలో జాత్యంహకారానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఈ ఆందోళనలు భారతీయ విద్యార్థుల నేతృత్వంలో జరుగుతుండటం గమనార్హం. ఇక అందులో ఒకరు భారత హైజంపర్ తేజస్విన్ శంకర్ కావడం మరో విశేషం.
జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగిన ఒక నెల తరువాత, కాన్సాస్ విశ్వవిద్యాలయంలో జాత్యహంకారనికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి. అమెరికన్ స్టూడెంట్స్ ఫస్ట్ గ్రూప్ అధ్యక్షుడు జాడెన్ మెక్నీల్ వివాదాస్పద ట్వీట్ ఈ నిరసనలకు మరింత అగ్గిని రాజేసాయి. 'మాదక ద్రవ్య రహిత నెలగా మార్చిన జార్జ్ ఫ్లాయిడ్కు అభినందనలు'అంటూ వివాదాస్పద రీతిలో మెక్నీల్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ నేపథ్యంలో తేజస్విన్ నేతృత్వంలోనే యూనివర్సిటీలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తేజస్విన్ నల్ల అథ్లేట్ల అందరికి బహిరంగంగా మద్దతు ప్రకటించాడు. ఇతర విద్యార్థుల నుంచి ఇలాంటి వివక్ష కొనసాగితే.. వారు శిక్షణ, పోటీల నుంచి తప్పుకుంటారని హెచ్చరించాడు. శరీర రంగు ఆధారంగా మనష్యులను అవమాన పర్చడం దారుణమని తేజస్విన్ తెలిపాడు. తన పట్ల కూడా ఇదే వైఖరి కొనసాగిస్తే వారి తరఫున తామెందుకు పోటీపడాలని ప్రశ్నించాడు.