స్టావెంజర్: నార్వే చెస్ ఓపెన్ గ్రూప్ ఏ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో 16 ఏళ్ల ప్రజ్ఞానంద 7.5 పాయింట్స్తో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ అందుకున్నాడు. శుక్రవారం జరిగిన 9వ రౌండ్లో భారత్కే చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ వీ ప్రణీత్పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. ప్రజ్ఞానంద తర్వాత ఇజ్రాయిల్కు చెందిన ఐఎమ్ మార్సెల్, స్వీడన్కు చెందిన జంగ్ మిన్ సియో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.
ఇక 6 పాయింట్లతో ప్రణీత్ మూడో స్థానంలో ఉండాల్సినప్పటికీ టై బ్రేక్ స్కోర్ కారణంగా ఆరో స్థానానికి పడిపోయాడు. ఫైనల్ రౌండ్లో ప్రణీత్పై గెలిచిన ప్రజ్ఞానంద 8వ రౌండ్లో మిఖాలెవ్స్కీ, 6వ రౌండ్లో విటలీ కునిన్, 4వ రౌండ్లో సుయరోవ్, రెండో రౌండ్లో సెమెన్ ముటుసోవ్, మతయాస్ ఉన్నెలాండ్పై గెలిచాడు. మరో మూడు గేమ్లను డ్రా చేసుకున్నాడు.
దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ నార్వే చెస్ టోర్నమెంట్ ఎనిమిదో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. మెమెద్యరోవ్ (అజర్బైజాన్) 22 ఎత్తుల్లో విషీని ఓడించాడు. ఈ పరాజయంతో 13 పాయింట్లతో ఆనంద్ మూడో స్థానానికి పడిపోయాడు. ఈ టోర్నీలో అయిదు రౌండ్ల వరకు మెరుగ్గా ఆడిన విషీ.. ఆ తర్వాత తడబడ్డాడు. మధ్యలో కార్ల్సన్పై గెలిచినా..
మెమెద్యరోవ్పై కీలక గేమ్లో ఓడడంతో అతడి టైటిల్ ఆశలు సన్నగిల్లాయి. మరోవైపు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (15 పాయింట్లు) టైటిల్కు మరింత చేరువయ్యాడు. మెమెద్యరోవ్ (14.5) అతడికి సమీపంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తొమ్మిదో రౌండ్లో లాగ్రెవ్ (ఫ్రాన్స్)పై కార్ల్సన్ 54 ఎత్తుల్లో విజయం సాధించాడు