అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్లో గ్లోబల్ జావెలిన్ త్రో ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత బళ్లెం వీరుడు, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్తో పాటు టాప్ జావెలిన్ త్రో ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.
ఈ విషయాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) మంగళవారం ప్రకటించింది. గ్లోబల్ జావెలిన్ త్రో ఛాంపియన్షిప్ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నామని విషయాన్ని వరల్డ్ అథ్లెటిక్స్కు తెలిజేశామని ఏఎఫ్ఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న సుమరివాలా తెలిపాడు.

'భారత్లో ఈ ఏడాది సెప్టెంబర్లో వరల్డ్ లెవెల్ జావెలిన్ ఛాంపియన్షిప్ జరిగే అవకాశం ఉంది. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాతో పాటు టాప్-10 ర్యాంక్ ప్లేయర్లు ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. 2027 వరల్డ్ రిలేస్, 2028 వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్, 2029 వరల్డ్ ఛాంపియన్షిప్లకు బిడ్లు మొదలయ్యాయి. ఈ టోర్నీ నిర్వహణకు భారత తన ఆసక్తిని తెలియజేసింది.'అని సుమరివాలా చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది ఆగస్ట్ 10న మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ పోటీలకు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2024లో నిర్వహించిన ప్రపంచ హాఫ్ మారథాన్ను నిర్వహించిన తర్వాత ఓ పెద్ద టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా మాజీ అథ్లెట్..
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) అధ్యక్షుడిగా మాజీ షాట్పుట్ ప్లేయర్ బహదూర్ సింగ్ సాగూ ఎన్నికయ్యారు. 2002 ఆసియా గేమ్స్లో బహదూర సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. 2029 వరకు బహదూర్ సింగ్ ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగనున్నాడు. 51 ఏళ్ల బహదూర్ సింగ్ 2000, 2004 ఒలింపిక్స్ బరిలో నిలిచాడు.
సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా అంజూ బాబీ జార్జ్ రెండో సారి ఎన్నికైంది. వైస్ ప్రెసిడెంట్గా అబు మేథా, జయంత బారువా, ఏకే శర్మ, కార్యదర్శిగా సందీప్ మెహతా ఎన్నికయ్యారు. తెలంగాణకు చెందిన స్టాన్లీ జోన్స్ ట్రెజరర్గా.. సారంగపాణి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.