భారత తొలి ఎలక్ట్రిక్ బైక్ రేసింగ్ జట్టు ఇండీ రేసింగ్ చరిత్ర సృష్టించింది. ఎఫ్ఐఎం ఈ ఎక్స్ప్లోరర్ ప్రపంచకప్లో కాంస్య పతకం సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. స్విట్జర్లాండ్లోని క్రాన్స్ మోంటానా వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఇండీ రేసింగ్ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా అరంగేట్ర సీజన్లో పతకాన్ని సొంతం చేసుకుంది.
ఎఫ్ఐఎం ఈ ఎక్స్ప్లోరర్ వరల్డ్ కప్ చివరి రౌండ్లో ఇండీ రేసింగ్ మహిళా రైడర్ శాండ్రా గోమెజ్ సత్తా చాటింది. మహిళల విభాగంలో శాండ్రా గోమెజ్ ఛాంపియన్షిప్ టైటిల్ను సాధించగా.. ఓవరాల్గా ఇండీ రేసింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. ప్రపంచకప్లో భాగంగా జరిగిన నాలుగు రేసుల్లో ఇండీ రేసింగ్ 479 పాయింట్లు సాధించింది.

బొనెల్ రేసింగ్ జట్టు 498 పాయింట్లతో చాంపియన్గా అవతరించగా.. 490 పాయింట్లతో హోండా రేసింగ్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో ఇండీ రేసింగ్ రైడర్ శాండ్రా గోమెజ్ 271 పాయింట్లతో సీజన్ విజేతగా నిలిచింది. ఇండీ రేసింగ్ జట్టులోని ఇతర రైడర్లు స్పెన్సర్ విల్టన్, రూనర్ సుదమాన్లు వరుసగా 162, 146 పాయింట్లతో మూడో స్థానంలో నిలిపారు.

ఈ విజయంపై ఇండీ రేసింగ్ టీమ్ ఓనర్ కంకణాల అభిషేక్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇదో ప్రత్యేక అనుభూతి అని చెప్పుకొచ్చాడు. 'ఈ రేసింగ్ జర్నీలో తొలి సీజన్లోనే మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించటం గొప్పగా ఉంది. రేసింగ్లోనూ భారత్కు పతకం తీసుకొచ్చే జట్టును మన అభిమానులకు అందించటం యజమానికి నాకు ఒక ప్రత్యేక అనుభూతి. భారత్లో 30 కోట్ల మంది రైడర్లు ఉన్నారు. ఇప్పుడు భారత్లో బైక్ ఉన్న ప్రతి కుర్రాడు రేసింగ్ గురించి కలలు కంటాడు' అని తెలిపారు.