హైదరాబాద్ వేదికగా వరల్డ్ జూనియర్ 10కే రన్ జరగనుంది. ఫిబ్రవరి 1న గచ్చిబౌలి స్టేడియంలో ఈ 10కే రన్ను నిర్వహించనున్నారు. ఈ 10కే రన్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్లో జరిగింది. ఆసియా క్రీడల మెడలిస్ట్, ప్రముఖ అథ్లెట్ అగసర నందిని ఈ రన్ పోస్టర్ను ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్లో తొలిసారి పిల్లల కోసం ఈ టైమ్డ్ రన్ను నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. పిల్లలకు బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి, ఫిట్నెస్పై శ్రద్ధ కలిగించడానికి ఇలాంటి పోటీలు బాగా ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ రన్లో తల్లిదండ్రులు తమ పిల్లలను భాగస్వాములను చేయాలని కోరారు.

అనంతరం రన్ను నిర్వహిస్తున్న స్పాట్ఆన్ సంస్థ సీఈఓ రోహిత్ మిశ్రా మాట్లాడుతూ.. అండర్-3 నుంచి అండర్-18 వయసు మధ్య పిల్లలు ఈ రన్లో పాల్గొనవచ్చని తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా ఈ రన్ను నిర్వహిస్తున్నామని, ఇందులో 84 ప్రైజ్ కేటగిరీలు ఉన్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా భరత్ రెడ్డి, రన్ క్యూరేటర్ రుచి శర్మ తదితరులు పాల్గొన్నారు. రియాన్, సిల్వర్ ఓక్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కొల్లూరు, పటాన్చెరువ్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు పలువురు విద్యార్థులు ఈ రన్లో పాల్గొంటున్నారు. ఆసక్తి గల వారు ఈ నెంబర్లకు 97848 37056, 97040 26666 ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.