పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరిన తొలి మహిళా భారత రెజ్లర్గా చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్.. చివరకు అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. పరిమితి కంటే 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో ఆమెపై వేటు తప్పలేదు. దాంతో ఆమెకు ఏ పతకం రాలేదు.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్)ను ఆశ్రయించినా నిరాశే ఎదురైంది. అయితే సెమీఫైనల్కు ముందు 49.9 కేజీలు మాత్రమే ఉన్న వినేష్ ఫోగట్.. ఆ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా 52.7 కేజీల బరువుకు చేరింది. తీవ్రంగా శ్రమించినా చివరి 100 గ్రాములను తగ్గించుకోలేక డిస్క్వాలిఫై అయ్యింది. అయితే ఆమె బరువు పెరగడానికి ప్రధాన కారణం తీసుకున్న ఆహారమే అని తెలుస్తోంది.

కొంపముంచిన ఫుడ్..
ఒకే రోజు మూడు మ్యాచ్లు ఉండటంతో ఎనర్జీ కోసం తీసుకున్న ఫ్లూయిడ్స్, పళ్ల రసం, స్నాక్స్ ఆమె కొంపముంచినట్లు సమాచారం. సెమీఫైనల్ జరిగిన రోజు వినేష్ ఫోగట్ ఓ గ్లాస్ పళ్ల రసం, ఫ్లూయిడ్స్, లైట్గా స్నాక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ కథనం ప్రకారం.. వినేష్ ఫోగట్ సెమీస్ మ్యాచ్ సందర్భంగా 300 గ్రాముల సమానమైన జ్యూస్ను తాగిందట.
బౌట్స్కు ముందు ఉత్సాహంగా ఉండేందుకు కొన్ని లీటర్ల ఫ్లూయిడ్స్ తీసుకుందని, దాంతోనే మూడు కిలోలు అదనంగా బరువు పెరిగిందని సమాచారం.
సెమీస్ ముగిసిన వెంటనే.. అధిక బరువును గుర్తించి కోచ్లు తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్క చుక్క నీటిని తీసుకోకుండా ట్రెడ్మిల్పై దాదాపు 6 గంటలపాటు కఠినంగా శ్రమించినా.. సౌనా బాత్ మూడు గంటలు చేసినా.. ఫలితం లేకపోయింది.
చివరకు దుస్తులకు ఉన్న ఎలాస్టిక్తో పాటు జుట్టును కూడా తీసేసినా.. అదనంగా 100 గ్రాములు ఉండటంతో 500 గ్రాముల ఒలింపిక్ మెడల్ను కోల్పోవాల్సి వచ్చింది.
కేటగిరీ మారడం..
రెజ్లర్లు బరువు పెంచుకోవడం, తగ్గించుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. రెగ్యులర్గా ఆడే కేటగిరిలో అయితే పెద్దగా కష్టం ఉండదు. కానీ వినేష్ ఫోగట్ సాధారణ 53 కేజీల విభాగంలో పోటీ పడేది. కానీ ఒలింపిక్స్ కోసం ఆమె 50 కేజీల కేటగిరీకి మారింది. దాంతో అదనంగా పెరిగిన బరువును తగ్గించుకోలేకపోయింది. అంతేకాకుండా సెమీస్ ముగిసిన తర్వాత ఫైనల్కు ఎక్కువ సమయం లేకపోవడం కూడా వినేష్ ఫోగట్కు నష్టం చేసింది.