భారత్లో క్రికెట్ను మతంలా భావిస్తారు. దాంతో ఇతర క్రీడలకు అంతగా ఆదరణ దక్కలేదు. జనాలు క్రికెట్ తప్పా మరో ఆట గురించి తెలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి కూడా చూపించేవారు కాదు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది. ఇతర క్రీడల వైపు కూడా ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ తరహాలోనే ఇతర క్రీడల లీగ్స్ దేశ ప్రజలను అలరిస్తున్నాయి. ఐపీఎల్ తర్వాత కబడ్డీ ప్రీమియర్ లీగ్ కాస్తో కూస్తో ఆదరణ దక్కించుకుంది. ఖో ఖో ప్రీమియర్ లీగ్, బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్స్, వాలీ బాల్ ప్రీమియర్ లీగ్స్ కూడా ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలే రగ్బీ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభమైంది. ముంబై వేదికగా సక్సెస్ఫుల్గా ఈ టోర్నీ జరుగుతుంది.
రగ్బీ ఆట గురించి చాలా మందికి తెలియదు. కానీ రాజమౌళి దర్శకుడిగా.. నితిన్ హీరోగా తెరకెక్కిన 'సై' సినిమా చూసుంటే మాత్రం ఈ ఆట గురించి కాస్తో కూస్తో అవగాహన ఉంటుంది. రగ్బీ ఆటనే ప్రధానంగా సై సినిమాను తెరకెక్కించిన రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరహాలోనే భారత్ వేదికగా జరుగుతున్న రగ్బీ ప్రీమియర్ లీగ్ కూడా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రగ్బీ ఆట గురించి తెలుసుకుందాం.

రగ్బీని ఒక పెద్ద దీర్ఘచతురస్రాకార మైదానంలో ఆడుతారు. మైదానానికి ఇరువైపుల H ఆకారంలో గోల్ పోస్ట్లు ఉంటాయి. గోల్ లైన్ వెనుక ఇన్-గోల్ ఏరియా ఉంటుంది. రగ్బీలో గుడ్డు ఆకారంలో ఓ పెద్ద బంతి ఉంటుంది.రగ్బీ ఆటను రెండు రకాలుగా ఆడుతారు. రగ్బీ యూనియర్లో లో ప్రతీ జట్టులో 15 మంది(8 ఫార్వర్డ్లు, 7 బ్యాక్లు) ఆటగాళ్లు ఉంటారు. రగ్బీ లీగ్లో 13 మంది ఆటగాళ్లు ఉంటారు. బెంచ్పై అదనపు ఆటగాళ్లు కూడా ఉంటారు. మ్యాచ్ సాధారణంగా 80 నిమిషాల పాటు రెండు విభాగాలుగా ఉంటుంది. మధ్యలో చిన్న విరామం ఇస్తారు.
ట్రై: రగ్బీ ఆటలో బంతిని ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించుకుంటూ తీసుకెళ్లి ఇన్-గోల్ ఏరియాలో నేలకు తాకిస్తే ట్రై అంటారు. ఇలా చేయడం ద్వారా 5 పాయింట్స్ సాధిస్తాయి. ట్రై చేసిన జట్టుకు కర్వర్షన్ చేసే అవకాశం దక్కుతుంది.
కర్వర్షన్: బంతిని సెంటర్ పాయింట్ నుంచి H ఆకారంలో ఉండే క్రాస్ బార్ పైనుంచి కిక్ చేస్తే కర్వర్షన్ అంటారు. ఇలా చేస్తే 2 పాయింట్స్ దక్కుతాయి.
పెనాల్టీ కిక్: ఫుట్బాల్ తరహాలోనే ప్రత్యర్థి జట్టు ఫౌల్ చేసినప్పుడు మ్యాచ్ రిఫరీ పెనాల్ట్ కిక్ ఇస్తాడు. ఆటగాడు మైదానంలో ఒక నిర్దిష్ట స్థానం నుంచి గోల్పోస్టుల మధ్య, క్రాస్ బార్ పై నుంచి కిక్ చేయాలి. ఇలా చేయడం ద్వారా 3 పాయింట్స్ లభిస్తాయి.
డ్రాప్ గోల్ : మ్యాచ్లో ఆటగాడు బంతిని కింద పడేసి, అది నేలను తాకగానే తిరిగి గాల్లోకి లేచేలోపు గోల్పోస్టుల మధ్య, క్రాస్ బార్ పైనుంచి కిక్ చేస్తే దాన్ని డ్రాప్ గోల్ అంటారు. ఇలా చేయడం ద్వారా 3 పాయింట్స్ లభిస్తాయి.
రగ్బీలో బంతిని చేతులతో పట్టుకొని ముందుకు పరుగెత్తాలి. కానీ బంతిని ముందుకు విసరడానికి వీలు లేదు. వెనక్కి లేదా పక్కకు మాత్రమే పాస్ చేయాలి. ముందుకు వెళ్లాలంటే మాత్రం చేతిలో పట్టుకొని మాత్రమే పరుగెత్తాలి. లేదా కిక్ చేయాలి.
టాకిల్: బంతి పట్టుకున్న ఆటగాడిని ప్రత్యర్థి ఆటగాళ్ళు కింద పడేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయడాన్ని టాకిల్ అంటారు. టాకిల్ చేసినప్పుడు బంతిని పట్టుకున్న ఆటగాడు వెంటనే బంతిని వదిలివేయాలి. తద్వారా ఇరు జట్ల ఆటగాళ్లు బంతి కోసం పోటీ పడుతారు.
రక్ : టాకిల్ తర్వాత బంతి నేలమీద పడ్డప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లు బంతిపై నియంత్రణ కోసం ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వస్తారు. ఇలా నెట్టుకోవడాన్ని రక్ అంటారు. రక్లో ఉన్న ఆటగాళ్లు బంతిని చేతులతో తీసుకోకూడదు.తాకకూడదు.కాళ్ళతో మాత్రమే బంతిని తమవైపు లాక్కోవాలి.
మౌల్: బంతి చేతిలో ఉన్న ఆటగాడిని టాకిల్ చేసినప్పటికీ అతను వదిలేయకుండా ఇతర ఆటగాళ్లతో తలపడినప్పుడు మౌల్ అంటారు. మౌల్లో ఆటగాళ్లు ఒకరినొకరు పట్టుకొని.. బంతిని కలిగి ఉన్న ఆటగాడిని ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తారు.
స్క్రమ్: ఆటలో చిన్నపాటి రూల్స్ బ్రేక్ అయినప్పుడు.. ఆటను తిరిగి ప్రారంభించేందుకు స్క్రమ్ పద్దతిని ఉపయోగిస్తారు. ఇరు జట్ల ఫార్వర్డ్ ఆటగాళ్లు ఒకరికొకరు తలలు వంచి మధ్యలో గ్యాప్ ఉండేలా గట్టిగా పట్టుకొంటారు. ఈ గ్యాప్లోకి బంతిని వేయగా.. లోపల ఉన్న హుకర్లు బంతిని తమ జట్టు వైపు నెట్టడానికి ప్రయత్నిస్తారు.
లైన్-ఔట్: బంతి మైదానం పక్కనున్న టచ్లైన్ను దాటి బయటకు వెళ్ళినప్పుడు లైన్-అవుట్ జరుగుతుంది. ఇరు జట్ల ఫార్వర్డ్ ఆటగాళ్ళు టచ్లైన్ నుంచి ఒక మీటరు దూరంలో రెండు సమాంతర లైన్లలో నిలబడతారు. ఒక ఆటగాడు బంతిని మధ్యలోకి విసురుతాడు, రెండు జట్ల ఆటగాళ్ళు సహచరుల సాయంతో బంతిని పట్టుకోవడానికి గాల్లోకి ఎగురుతారు
ఆఫ్ సైడ్ : రగ్బీలో ఆఫ్ సైడ్ నియమాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. సాధారణంగా ఆటగాళ్లు బంతి వెనుకనే ఉండాలి. బంతి కంటే ముందు ఉంటే ఆ ఆటగాడు ఆఫ్సైడ్లో ఉన్నట్లు పరగణిస్తారు. అతన్ని ఆడేందుకు అనుమతించరు.
భారత్ వేదికగా జరుగుతున్న రగ్బీ ప్రీమియర్ లీగ్ను రగ్బీ ఫార్మాట్ సెవెన్స్ ఆధారంగా నిర్వహిస్తున్నారు. ప్రేక్షకుల ప్రసార సౌలభ్యం కోసం ఆటలో కొన్ని స్వల్ప మార్పులు చేశారు. ఈ టోర్నీలో ప్రతి జట్టు నుంచి 7 మంది ఆటగాళ్ళు మాత్రమే ఉంటారు. 4 నిమిషాల చొప్పున నాలుగు క్వార్టర్స్ పాటు మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడుతున్నాయి.