
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత్కు గట్టి షాక్ తగిలింది. స్టార్ స్ప్రింటర్ హిమదాస్ గాయం కారణంగా సమ్మర్ గేమ్స్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది. గత నెల చివర్లో జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల హీట్ విభాగంలో పోటీ పడుతుండగా హిమదాస్ కాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని హిమదాసే ట్విటర్ వేదికగా తెలియజేసింది.
'అనూహ్య గాయంతో తొలి ఒలింపిక్స్లో పాల్గొనే బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోతున్నాను. 100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో క్వాలిఫికేషన్ మార్క్ను అందుకునేందుకు అన్ని విధాల సిద్దమైన తర్వాత ఇలా గాయంతో తప్పుకొవాల్సి రావడం బాధగా ఉంది. నాకు అండగా నిలిచిన కోచ్లు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. ఈ గాయం నుంచి కోలుకొని వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఏషియా గేమ్స్, వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీల సత్తా చాటేందుకు సిద్దంగా ఉంటాను'అని హిమ దాస్ ట్వీట్ చేసింది.
ద్యుతిచంద్, ధనలక్ష్మి, అర్చన సుసీంద్రన్తో కూడా భారత 4x100 మీ మహిళ రిలే టీమ్లో కూడా హిమదాస్ ఉన్నప్పటికీ.. ఆ టీమ్ టోక్యో బెర్త్ను అందుకోలేకపోయింది. ఇక గత నెలలో జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ టోర్నీలో టోర్నీలో 100 మీ హీట్ మూడో రౌండ్లో 12.01 సెకండ్లలో హిమదాస్ లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఫైనల్కు అర్హత సాధించింది. తొడ కండరాల గాయంతో ఫైనల్ ఆడకుండానే ఈ టోర్నీ నుంచి హిమ వెనుదిరిగింది.
2018లో ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో హిమా 400 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఈఘనత సాధించిన భారత తొలిమహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం సాధించింది. ఆమె సేవలను గుర్తించిన అసోం ప్రభుత్వం ఇటీవలె డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పదవిని కట్టబెట్టింది.