ఒలింపిక్స్లో వరుసగా రెండు కాంస్య పతకాలు సాధించినా భారత పురుషుల హాకీ టీమ్ ప్లేయర్లను ఈ దేశ ప్రజలు గుర్తించడం లేదని హాకీ మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఎయిర్పోర్ట్లో హాకీ ఆటగాళ్లను పక్కనపెట్టి సోషల్ మీడియా స్టార్, ప్రముఖ చాయ్వాలా డాలీతో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడ్డారని, ఈ ఘటన తమను తీవ్ర ఇబ్బంది గురి చేసిందని తెలిపాడు.
తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ సింగ్ ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. 'ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు గెలిచినా భారత హాకీ టీమ్కు సరైన గుర్తింపు దక్కలేదు. నేను స్వయంగా ఎయిర్పోర్ట్లో నా కళ్లతో చూశాను. అక్కడ నాతో పాటు భారత హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్ ఉన్నారు.

మరోవైపు సోషల్ మీడియా స్టార్, ప్రముఖ చాయ్వాలా డాలీ అక్కడికి వచ్చాడు. దాంతో జనాలంతా అతనితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఘటనతో ఆశ్చర్యానికి గురైన మేం ఒకరినొకరం చూసుకున్నాం. అది మాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. హర్మన్ప్రీత్ సింగ్ 150 ప్లస్ గోల్స్ చేయగా.. మన్దీప్ 100 ప్లస్ గోల్స్ చేశాడు.
డాలీ చాయ్వాలా స్పెషల్ టీని తయారు చేసి గుర్తింపు పొందాడు. బిల్గేట్స్కు టీ అందించడం గొప్ప విషయమే. కానీ ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన మాకు సరైన గుర్తింపు దక్కలేదు. క్రీడాకారులకు కీర్తీ, డబ్బు ముఖ్యమే. కానీ అంతకంటే ఎక్కువ ఆనందం అభిమానులు నుంచి వస్తుంది.'అని హార్దిక్ సింగ్ చెప్పుకొచ్చాడు.
క్రికెటర్ల కంటే మేమే ఫిట్గా..
టీమిండియా క్రికెటర్ల కంటే భారత హాకీ టీమ్ ప్లేయర్ల యోయో టెస్ట్ స్కోర్ ఎక్కువని హార్దిక్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్షించేందుకు యో యో టెస్ట్ను ప్రమాణికంగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే. టీమిండియాలో విరాట్ కోహ్లీ యోయో స్కోర్ 17.2 హయ్యెస్ట్. ప్రతీ ఆటగాడు యో యో టెస్ట్ పాసవ్వాలంటే కనీసం 16.5 స్కోర్ నమోదు చేయాలి.
అయితే భారత పురుషుల హాకీ టీమ్లోని ఏడుగురు ఆటగాళ్లు సునాయసంగా యోయో టెస్ట్లో 23.8 స్కోర్ నమోదు చేస్తారని హార్దిక్ సింగ్ తెలిపాడు. ఇటీవల ఆటకు వీడ్కోలు పలికిన గోల్ కీపర్ శ్రీజేష్ ఒక్కడే యోయో స్కోర్ 21 కంటే ఎక్కువే నమోదు చేస్తాడని చెప్పుకొచ్చాడు. ఇటీవల ముగిసిన హాకీ ఆసియా ఛాంపియర్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ టీమ్ విజేతగా నిలిచింది. ఓటమెరుగని జట్టుగా టైటిల్ గెలిచింది.