
టోక్యో: కరోనా వైరస్ నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వహణ అంటేనే టోక్యో ప్రజలు జంకుతున్నారు. మెగా ఈవెంట్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ.. టోక్యో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నది. కరోనా కారణంగా జపాన్లో జరగాల్సిన ఒలింపిక్స్ను వచ్చే ఏడాదికి రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, 2021లోనూ విశ్వక్రీడలు జరగొద్దని 50 శాతం మందికిపైగా టోక్యో వాసులు కోరుకుంటున్నట్టు ఓ సర్వే వెల్లడించింది.
జపాన్కు చెందిన రెండు వార్తా సంస్థలు ఈ సర్వేను నిర్వహించాయి. టెలిఫోన్ పోల్లో 1030 మంది పాల్గొన్నారు. వీరిలో 51.7 శాతం మంది 2021లో ఒలింపిక్స్ జరిగే అవకాశం లేదని లేదంటే మరోసారి వాయిదా పడొచ్చని చెప్పారు. 46.3 శాతం మంది మాత్రం ఒలింపిక్స్ జరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ను వ్యతిరేకించిన వారిలో 27.7 శాతం మంది రద్దు చేయాలని డిమాండ్ చేయగా.. 24 శాతం మంది రెండోసారి వాయిదా వేయాలని కోరారు.
ఇక ప్రస్తుత పరిస్థితుల్లో గేమ్స్ నిర్వహణ అంత భద్రత కాదని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రేక్షకులు లేకుండా కోరుకునేవారి శాతం 31.1గా ఉండగా.. 15.2 శాతం మంది పూర్తి స్థాయి ఒలింపిక్స్ను కోరుకుంటున్నారు. ఇక ఈ ఏడాది జరగాల్సిన విశ్వక్రీడలను 2021, జూలై 23కు రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.