న్యూఢిల్లీ: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా, మాజీ ఫార్ములా 1 రేసర్ మైఖేల్ షూమేకర్పై భారత్లో చీటింగ్ కేసు నమోదైంది. ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి ప్రచారకర్తలుగా ఉన్న వీరిపై సదరు కంపెనీ బాధితులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరు స్పోర్ట్స్ స్టార్స్తో పాటు మరో 11 మందిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో గుర్గావ్ పోలీసులు నేరపూరిత కుట్ర కింద షరపోవా, మైఖేల్ షూమెకర్పై కేసు నమోదు చేశారు.
షరపోవా ప్రచారకర్తగా ఉన్న ఓ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో తాను ఓ ఫ్లాట్ బుక్ చేశానని చత్తర్ పూర్ మినీ ఫామ్లో నివాసం ఉంటున్న షెఫాలీ అగర్వాల్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాజెక్ట్లోని ఒక టవర్కు షూమేకర్ పేరు పెట్టారని ఆమె పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ 2016 నాటికి పూర్తి కావాల్సి ఉందని, కానీ ఇప్పటివరకు ప్రారంభించలేదని షఫాలీ ఫిర్యాదులో పేర్కొందని గుర్గావ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దినకర్ పీటీఐకి తెలిపారు. కోర్టు ఆదేశం మేరకు, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
అంతర్జాతీయ సెలబ్రిటీలు ఈ ఫేక్ ప్రాజెక్ట్కు ప్రచారకర్తలుగా ఉండి ఈ మోసంలో భాగమయ్యారని ఫఫాలీ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతకుముందు, ఆమె M/S రియల్టెక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్పై గురుగ్రామ్ కోర్టులో ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ స్టార్స్ అయిన షరపోవా, షూమేకర్లను తమ ప్రచారకర్తలుగా చూపించి ఈ కంపెనీ దాదాపు తనను రూ.80 లక్షల వరకు మోసం చేశారని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
గుర్గావ్లోని సెక్టార్ 73లో షరపోవా పేరు మీద ఉన్న ప్రాజెక్ట్లో తాను, తన భర్త రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ను బుక్ చేసుకున్నామని, అయితే డెవలపర్ కంపెనీలు తమ ప్రాజెక్ట్లో భాగంగా డబ్బు వసూలు చేశారని.. చివరకు ఫ్లాట్ను సిద్దం చేయకుండా తమను మోసం చేశాయంటూ కోర్టులో పేర్కొంది. తాము ప్రాజెక్ట్ గురించి ప్రకటనల ద్వారా తెలుసుకున్నామని.. ప్రాజెక్ట్ చిత్రాలు, వాగ్దానాలు చూసి కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి మోసపోయామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రాజెక్ట్ ప్రచారకర్తలుగా షరపోవా, షూమేకర్ ఉన్నారని.. దాంతో సదరు కంపెనీని నమ్మమాని, షరపోవా సైతం తన అధికారిక వెబ్సైట్లో ఈ కంపెనీ గురించి ప్రస్తావించిందని తెలిపింది.