Bhavina Patelకు భారీ నజరానా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం!

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన టేబుల్ టెన్నిస్(టీటీ) క్రీడాకారిణి భవీనా పటేల్కు గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ. 3 కోట్ల నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపింది. గుజరాత్ మహేసాణా జిల్లాలోని సుంధియా గ్రామానికి చెందిన భవీనా పారాలింపిక్స్లో ఆదివారం జరిగిన క్లాస్-4 టేబుల్ టెన్నిస్ ఫైనల్ మ్యాచ్లో చైనా ప్లేయర్ యింగ్ జావోపై 0-3తో ఓడి రజతం సొంతం చేసుకుంది. పతకం సాధించిన భవీనాను గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభినందించారు. 'మహేసాణా ముద్దుబిడ్డ.. టేబుల్ టెన్నిస్లో పతకం సాధించి దేశం గర్వించేలా చేసింది' అని అన్నారు. 'దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన' కింద భవీనాకు రూ. 3 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పతకం వారికే అంకితం.
తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి ఈ సిల్వర్ మెడల్ను అంకితమిస్తున్నానని భవీనా పటేల్ తెలిపింది. 'నా ప్రదర్శనపై కొద్దిగా నిరాశతో ఉన్నా. ఎందుకంటే ఈ రోజు నా స్థాయి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ, వచ్చే టోర్నమెంట్లో ఈ లోపాలను సరిదిద్దుకుంటా. ఏ అథ్లెట్ అయినా వంద శాతం ప్రదర్శన ఇస్తే ఓడిపోరు అని నేను నమ్ముతా. నాకు ఎదురయ్యే సమస్యలతో నేనెప్పుడూ కుంగిపోను. ఎందుకంటే ఒక దారి మూసుకుపోతే.. భగవంతుడు మరిన్ని అవకాశాలు ఇస్తాడని నమ్ముతా'అని భవీనా చెప్పుకొచ్చింది.

వారందరి వల్లే..
"నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఈ పతకాన్ని అంకితం చేస్తున్నా. పీసీఐ, ఎస్ఏఐ, టీఓపీఎస్, బ్లైండ్ పీపుల్ అసోసియేషన్, నా మిత్రులు, కుటుంబసభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మంచి శిక్షణ ఇచ్చిన నా కోచ్కు కూడా ఈ పతకం అంకితం చేస్తున్నా. ఫిజియో, డైటిషియన్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కూడా నాకు ఎంతగానో ప్రేరణ ఇచ్చారు.'అని చెప్పుకొచ్చింది. సమస్యలను సానుకూల కోణంలో చూడటం నేర్చుకున్నట్లు తెలిపిన భవీనా..కష్టపడి పనిచేయడానికి ఈ ఆలోచనా విధానమే ధైర్యాన్నిస్తుందని చెప్పింది. టోక్యో ఒలింపిక్స్ నుంచి చాలా నేర్చుకున్నట్లు తెలిపింది. వచ్చే పారాలింపిక్స్లో కచ్చితంగా వంద శాతం మెరుగైన ప్రదర్శన చేస్తానని పేర్కొంది.

ప్రశంసల జల్లు..
పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో భారత్కు రజత పతకం అందించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ భవీనా పటేల్కు ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. 'పారాలింపిక్స్లో రజతం సాధించి భారత బృందానికి, క్రీడా ప్రేమికులకు భవీనా స్ఫూర్తినిస్తోంది. ఆమె అసాధారణమైన సంకల్పం, నైపుణ్యాలు దేశానికి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఈ అసామాన్యమైన విజయం సాధించిన భవీనాకు అభినందనలు' అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

చరిత్ర లిఖించావ్..
'భవీనా పటేల్కు అభినందనలు. ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చరిత్ర లిఖించావ్. దేశానికి చరిత్రాత్మక రజత పతకం తీసుకొస్తున్నావు. నీ జీవిత ప్రయాణం ఇతరులకు ప్రేరణగా నిలవడమే కాకుండా యువతను క్రీడల వైపు ఆకర్షితులను చేస్తుంది' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'పారాలింపిక్స్లో రజత పతకం సాధించినందుకు భవీనా పటేల్కు అభినందనలు. మీ విజయాన్ని దేశం ప్రశంసిస్తోంది. మీరు దేశం గర్వపడేలా చేశారు' అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వీరితో పాటు భారత మహిళా రెజ్లర్ గీత ఫొగాట్, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో భారత్కు తొలి స్వర్ణం అందించిన అభినవ్ బింద్రా, భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ భవీనాకు ట్విటర్ ద్వారా అభినందలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications