Neeraj Chopra: బళ్లెం వీరుడి విజయం కోసం భారత ప్రభుత్వ ఖర్చు ఎంతంటే?

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా పసిడి పతకంతో భారత్కు ఘనమైన ముగింపునిచ్చాడు. 13ఏళ్ల భారత స్వర్ణ నిరీక్షణకు తెరదించుతూ విశ్వ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఈవెంట్లో 23 ఏళ్ల నీరజ్ ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అతని విజయంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబురాన్నంటాయి.
రాష్ట్రపతి, ప్రధాని నుంచి మొదలుకొని సామాన్యుని వరకు అందరూ నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే నీరజ్ విజయం వెనుక భారత ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఉంది. అతని ప్రతిభ గుర్తించిన ప్రభుత్వం నీరజ్ ట్రైనింగ్ కోసం సుమారు రూ. 7 కోట్లు ఖర్చు చేసింది.

ప్రతిభకు ప్రభుత్వం అండ..
2012లో అండర్ 16 నేషనల్ చాంపియన్గా నిలిచిన నీరజ్.. 2015లో మన హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చాడు. 2016లో పోలాండ్ వేదికగా జరిగిన ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జావెలిన్ను ఏకంగా 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే నీరజ్ టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణాన్ని ముద్దడడానికి తనలో ఎంత ప్రతిభ ఉందో, దానికి రెట్టించిన కష్టం కూడా ఉంది. నీరజ్ ప్రతిభ, కష్టాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. టోక్యో ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా నీరజ్ కోసం భారీ వ్యయప్రయాసలకోర్చింది.

విదేశాల్లో ట్రైనింగ్కు రూ. 5 కోట్లు..
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) లెక్కల ప్రకారం ఈ ఒలింపిక్స్కు ముందు 450 రోజుల పాటు నీరజ్ చోప్రా విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి, పోటీల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,85,39,638 ఖర్చు చేసింది. ఇక 2019లో నీరజ్ చోప్రాకు మోచేయి శస్త్ర చికిత్స తర్వాత అతనికి వ్యక్తిగత కోచ్గా డాక్టర్ క్లాస్ బార్టోనియెట్జ్ను నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం రూ.1,22,24,880 చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావెలిన్లకు రూ.4,35,000 ఖర్చు చేసింది.

యూరప్లో 50 రోజులు..
ఒలింపిక్స్కు కొద్ది రోజుల ముందు 2021లో నీరజ్ యూరప్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి 50 రోజుల పాటు స్వీడన్లో ఉన్నాడు. ఇందుకోసం ప్రభుత్వం రూ.19,22,533 ఖర్చు చేసింది. మెరుగైన క్రీడాకారుడిగా రాటుదేలేందుకు కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడంతో అందుకు ప్రతిఫలంగా నీరజ్ దేశ మువ్వన్నెల జెండాను విశ్వక్రీడల్లో రెపరెపలాడించాడు. నీరజ్ చోప్రాకు ముందు అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో 2008 బీజింగ్ ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణాన్ని అందించాడు. ఈ క్రీడల్లో భారత్ 7 పతకాలు సాధించింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ చరిత్రలోనే ఇది భారత్కు మెరుగైన రికార్డు. 2012 లండన్ ఒలింపిక్స్ భారత్కు 6 పతకాలు వచ్చాయి.
ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత ప్రదర్శన గతంలో కంటే ఈసారి మెరుగైందని చెప్పవచ్చు. మన అథ్లెట్లు ముఖ్యంగా స్ప్రింటర్లు.. మెడల్స్ తీసుకురాకపోయినా చెప్పుకోదగ్గ పెర్ఫామెన్స్లు ఇచ్చారు. సెయిలర్లు, రోయర్లు కూడా ఫర్వాలేదనిపించగా.. గోల్ఫ్లో భారత్ తొలిసారి మెడల్కు దగ్గరైంది. అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో మెడల్ మిస్ అయ్యింది. కానీ చాలా మందిలో స్పూర్తి నింపింది. ఓవరాల్గా టోక్యో ఒలింపిక్స్ తర్వాత భారత్లో క్రీడా ప్రగతి టాప్ గేర్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications