ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ (కేఐడబ్ల్యూజీ) 2026లో తెలుగు తేజం జెస్సీ రాజ్ మాత్రాపు సిల్వర్ మెడల్తో మెరిసింది. లడఖ్లోని లేహ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'ఫిగర్ స్కేటింగ్' విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 15 ఏళ్ల జెస్సీ రాజ్ మాత్రాపు రెండో స్థానంలో నిలిచి పతకం సాధించింది.
జెస్సీ రాజ్ ప్రాథమికంగా రోలర్ స్కేటింగ్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్రీడాకారిణి. కేవలం కొన్ని వారాల క్రితమే ఐస్ స్కేటింగ్ను ప్రారంభించిన జెస్సీ, తన తొలి పోటీలోనే అద్భుత ప్రదర్శన కనబరిచి 'అడ్వాన్స్డ్ గర్ల్స్ షార్ట్ ప్రోగ్రామ్'లో రెండో స్థానంలో నిలిచింది. డెహ్రాడూన్లో జరిగిన స్వల్పకాలిక శిక్షణ శిబిరమే ఆమెకు ఐస్ స్కేటింగ్లో లభించిన ఏకైక అనుభవం.

ఈ విజయం నేపథ్యంలో జెస్సీ రాజ్ మైఖేల్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడింది. తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ విషయాలు ఆమె మాటల్లోనే...
ఐస్ స్కేటింగ్ అనుభవంపై: 'ఐస్ స్కేటింగ్ నాకు చాలా కొత్త. ఇది ఒక గొప్ప అనుభవం. నవంబర్లో డెహ్రాడూన్ క్యాంప్లో మొదటిసారి ఐస్ మీద స్కేటింగ్ చేశాను. రోలర్ స్కేటింగ్తో పోలిస్తే ఐస్ మీద బ్యాలెన్స్ చేయడం మొదట్లో కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఐస్ మీద పడిపోవడం కూడా నాకు నచ్చుతుంది.
సౌత్ ఇండియాలో వసతుల కొరతపై: 'మా విజయవాడలో ఐస్ రింక్స్ లేవు. కాబట్టి మేము రోలర్ స్కేట్స్పైనే ప్రాక్టీస్ చేస్తూ, జంప్స్, స్పిన్స్పై దృష్టి పెడతాం. ఫిట్నెస్ అనేది ఏ స్కేటింగ్కైనా ప్రాథమిక అవసరం.
చదువు, క్రీడలు సమన్వయం:
'ప్రస్తుతం నేను 10వ తరగతి చదువుతున్నా. వచ్చే నెలలో నాకు పరీక్షలు ఉన్నాయి. చదువులో కూడా నేను 85 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నా. మా స్కూల్ మేనేజ్మెంట్ నాకు పూర్తి మద్దతునిస్తోంది.
భవిష్యత్తు లక్ష్యాలు: '2026లో పూర్తిగా చదువుపై దృష్టి పెడతాను. ఆ తర్వాత 2027లో జరిగే ఆసియా, వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున బరిలోకి దిగి పతకాలు సాధించడమే నా లక్ష్యం.'అని జెస్సీ చెప్పుకొచ్చింది.
జెస్సీ తల్లి ఒక అథ్లెట్ (200 మీటర్ల స్ప్రింటర్) కావడం విశేషం. కుటుంబ ప్రోత్సాహం, పట్టుదలతో జెస్సీ రాజ్ అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగురవేయడానికి సిద్ధమవుతోంది.