
చైనీస్ తైపీ: కరోనా కారణంగా యావత్ ప్రపంచమే అతలాకుతలమైంది. క్రీడాటోర్నీలన్నీ రద్దవ్వడమో.. వాయిదా పడటమో జరిగింది. ఈ మహమ్మారి దెబ్బకు దేశాలన్ని లాక్డౌన్ పాటిస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం అంతగాలేని తైవాన్లో మాత్రం కొన్ని టోర్నీలు జరుగుతున్నాయి. కాకపోతే ప్రేక్షకుల్లేకుండా ఈ టోర్నీలు నిర్వహిస్తున్నారు.
అయితే ఈలగోలల్లేని మైదానంలో ఎంచక్కా ఆడుకోవాల్సిన ఆటగాళ్లు తన్నులాడుకున్నారు. ఈ దెబ్బలాటలో భౌతిక దూరం సంగతే మరిచారు. మ్యాచ్ ప్రసారం కావాల్సిన టీవీల్లో కొట్లాట 'ప్రత్యక్ష' ప్రసారమైంది. చైనీస్ తైపీ బేస్బాల్ లీగ్లో భాగంగా ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
రకుటెన్ మంకీస్, ఫుబొన్ గార్డియన్స్ జట్ల మధ్య బేస్బాల్ మ్యాచ్ ప్రేక్షకుల్లేకుండా జరిగినా ... ఇరుజట్ల ఆటగాళ్ల తగవుతో అల్లరిపాలైంది. భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఎవరినీ అనుమతించని స్టేడియంలో విచక్షణ మరిచిన ఆటగాళ్లు ఒకరిమీద ఒకరుపడి మరీ కొట్టుకోవడం తైపీ వర్గాల్ని కలవరపెట్టింది. గేమ్ నాల్గో ఇన్నింగ్స్లో ఈ గొడవ చేసుకుంది.
అయితే బేస్బాల్లో ఇలాంటి గొడవలు సహజమేనని, ఇంతకన్నా పెద్దు ఎత్తులో ఆటగాళ్లు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని లీగ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అభిమానులు మాత్రం ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'అన్ని దేశాలు, ఆటలు, సినిమాలు లేక ఇంట్లో కూర్చుంటే.. మిమ్మల్ని హాయిగా ఆడుకోమంటే కొట్టుకుంటారెందయ్యా'అని సెటైర్లు విసురుతున్నారు. ఇక ఈ ద్వీప దేశం బేస్బాల్ తగవుతో వార్తల్లోకెక్కినా... ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్నే పకడ్బందీ చర్యలతో కట్టడి చేసిన దేశంగా కితాబులందుకుంటోంది. డబ్ల్యూహెచ్వో తాజా లెక్కల ప్రకారం తైవాన్లో ఇప్పటి వరకు కేవలం 422 కేసులు నమోదు కాగా 203 మంది రికవరీ అయ్యారు. ఆరుగురు మాత్రమే మరణించారు.