ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తనను ఆదుకోవాలని భారత హర్డిల్ క్వీన్, తెలుగు తేజం జ్యోతి యర్రాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని జ్యోతి యర్రాజీ ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖపట్టణానికి చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ.. ఉత్తరఖాండ్లోని డెహ్రాడూన్ వేదికగా జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్లో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. 100 మీటర్ల హర్డిల్ను 13.10 సెకండ్లలోనే పూర్తి చేసి నేషనల్ గేమ్స్ రికార్డ్ను బ్రేక్ చేసింది.
ఈ ప్రదర్శనతో సౌత్కొరియా వేదికగా జరగబోయే ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025కు అర్హత సాధించింది. 200 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లోనూ జ్యోతి యర్రాజీ విజేతగా నిలిచింది. 23.35 సెంకండ్లలోనే రేసును పూర్తి చేసింది. చెనా వేదికగా జరిగిన 2023 ఆసియా గేమ్స్లోనూ జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లోనూ భారత్ తరఫున హర్డిల్స్ ఈవెంట్లో బరిలోకి దిగింది.

సెక్యూరిటీ గార్డ్ కూతురు..
ఇన్ని ఘనతలు సాధించినా జ్యోతి యర్రాజీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. జ్యోతి యర్రాజి తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డు. అతని వేతనం నెలకు రూ. 7000. తల్లి పేరు కుమారి. ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోన్నారు. ఆమెకు చాలి చాలని జీతం. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి యర్రాజీ అథ్లెటిక్స్లో రాణిస్తోంది. ఆమెకు సంబంధించిన ట్రైనింగ్, న్యూట్రిషన్ రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటుంది. జ్యోతి యర్రాజీ రైల్వేలో పనిచేస్తోనప్పటికీ గౌరవ వేతనం అందడం లేదు. నెలకు రూ. 27వేల రూపాయల వేతనం మాత్రమే జ్యోతికి వస్తోంది.
ఆర్థికంగా ఆదుకోండి..
తన కుటుంబానికి ఆర్థిక భద్రత లేకపోవడం తన కెరీర్కు అడ్డంకిగా మారిందని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని, కనీసం ఓ మంచి ఉద్యోగమైనా ఇవ్వాలని ఆమె రిక్వెస్ట్ చేసింది. తాజాగా మైకేల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తనకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. లేకుంటే భవిష్యత్తులో అథ్లెటిక్స్ను ఎవరూ కెరీర్గా ఎంచుకోరని అభిప్రాయపడింది.
రూ.20 లక్షలే ఇచ్చారు..
'ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన అథ్లెట్లకు ఇతర రాష్ట్రాలు రూ. 3 కోట్లు ఇస్తే.. నాకు మాత్రం రూ. 20 లక్షలే ఇచ్చారు. ఈ విషయంలో ఎందుకు సమానత్వం లేదు. ఇప్పటికే నా తల్లిదండ్రులు ఎన్నో త్యాగం చేశారు. ఇప్పటికీ సరైన అర్థిక భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ స్థాయి అథ్లెట్ అంటే ఏంటో కూడా నా తల్లికి తెలియదు. ఆమె ఇప్పటి వరకు వైజాగ్ దాటి రాలేదు. నా తల్లిదండ్రులకు నేను మెరుగైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అలా చేయడానికి నాకు సాయం కావాలి.
వారికి ఏం సందేశం ఇస్తున్నట్లు..?
నాలాంటి క్రీడాకారులకే సరైన ఆదరణ లేకపోతే యువ ప్రతిభావంతులు ఎలా వస్తారు? వారికి ఏం సందేశం ఇస్తున్నట్లు? కష్టానికి తగిన గుర్తింపు లేదని వారు నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదం ఉంది. జాతీయ స్థాయిలో క్రికెటర్లు కోట్లు సంపాదిస్తున్నారు. అథ్లెట్లకు అదే గుర్తింపు ఎందుకు లభించదు? క్రీడల్లో సమానత్వం అవసరం.
అర్జున అవార్డ్ కారక్రమానికి హాజరవ్వడం నాతో పాటు నా తల్లిదండ్రులకు ఓ కల. కానీ పరిస్థితులు నన్ను ఆ కార్యక్రమానికి వెళ్లకుండా చేశాయి. ఇది నన్ను తీవ్రంగా బాధించింది. మీడియా, జనాలను నేను అభ్యర్థించేది ఒక్కటే నా పరిస్థితి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లండి. ప్రభుత్వం నాకు అండగా నిలిస్తే నేను మరింత మెరుగైన ప్రదర్శన చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తాను'అని జ్యోతి యర్రాజీ చెప్పుకొచ్చింది.