
హైదరాబాద్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్లో మెడల్ సాధించాడు. స్వతంత్ర భారత దేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు. భారత కీర్తిపతాకను అత్యున్నత శిఖరాలలో రెపరెపలాడించేలా చేశాడు. ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. అయితే ఆ చరిత్రకు తొలి అడుగు పడింది మన హైదరాబాద్లోనే. అవును 2015లో హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్-20 విభాగంలో పాల్గొన్న నీరజ్.. ఈటెను 76.91మీటర్ల దూరం విసిరి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత జూనియర్స్ విభాగంలో గతేడాది ఓ క్రీడాకారుడు ఆ రికార్డును తిరగరాశాడు.
సీనియర్ అథ్లెట్గా రాటుదేలిన నీరజ్ తనను తాను మెరుగు పర్చుకుంటూ టోక్యో ఒలింపిక్స్లో 87.58మీటర్ల దూరంతో ప్రపంచ వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ విజయానికి హైదరాబాద్ నగరం పండగ చేసుకుంది. ఆట జరుగుతున్నంత సేపూ నగర క్రీడాభిమానులంతా టీవీలకు అతుక్కుపోయారు. విజేతను ప్రకటించి.. జాతీయ గీతాలాపన జరిగే సమయంలో ప్రతి కన్ను చెమ్మగిల్లింది. అనేక ప్రాంతాల్లో స్వీట్లు పంచుకుని సంబంరాలు చేసుకున్నారు. రాష్ట్ర సీం కేసీఆర్తో సహా సినీ, రాజయకీయ, వ్యాపార ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులు సైతం నీరజ్ చోప్రా విజయాన్ని కొనియాడారు.
టోక్యో ఒలింపిక్స్తో తాను సాధించిన స్వర్ణాన్ని నీరజ్ చోప్రా స్ప్రింట్ లెజెండ్ మిల్కా సింగ్కు అంతితమిచ్చాడు. 'ఈ స్టేడియంలో జాతీయ గీతాన్ని వినాలని మిల్కా కోరుకున్నారు. కానీ ఆయన మన మధ్య లేరు. అయినప్పటికీ ఆయన కల నెవరేరింది'అని నీరజ్ ట్వీట్ చేశాడు. దీనిపై మిల్కా ఫ్యామిలీ ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'ఈ వైభవం కోసం నాన్న చాలా ఏళ్లు ఎదురు చూశాడు. చివరకు ఆ కల నెరవేరింది. నీరజ్ ట్వీట్ను చూసి నేనే ఏడ్చేశా. పై నుంచి నాన్న కూడా ఏడ్చేసి ఉంటాడు. మమ్మల్ని సంతోషంగా ఉంచినందుకు అందరికి థ్యాంక్స్'అని మిల్కా కొడుకు జీవ్ పేర్కొన్నాడు.
ఇక స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాపై కనకవర్షం కురుస్తోంది. పతకం గెలిచిన వెంటనే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్ల నజరానా ప్రకటించగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కోటి రూపాయల క్యాష్ రివార్డు ఇస్తామని చెప్పింది. తాజాగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ రూ.2 కోట్ల నగదు రివార్డును అందజేస్తామని తెలిపింది. ఇతర కంపెనీలు, ప్రభుత్వాలు సైతం నీరజ్ చోప్రాపై కనకనవర్షం కురిపిస్తున్నాయి.