భారత యువ గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ చరిత్రసృష్టించింది. లండన్ వేదికగా జరుగుతున్న ఫిడే వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టీమ్ ఛాంపియన్షిప్ 2025లో సంచలన విజయం సాధించింది. గురువారం జరిగిన బ్లిట్జ్ సెమీఫైనల్స్ రెండో లెగ్లో దివ్య దేశ్ముఖ్ వరల్డ్ నెంబర్ వన్ మహిళా చెస్ ప్లేయర్ హౌ యిఫాన్(చైనా)ను ఓడించింది. ఈ గెలుపుతో భారత చెస్ చరిత్రలో ఈ ఘనతను అందుకున్న ప్లేయర్గా నిలిచింది. మొదటి లెగ్లో దివ్య యిఫాన్ చేతిలో ఓడిపోయినప్పటికీ, రెండవ లెగ్లో తెల్ల పావులతో అద్భుత విజయాన్నందుకుంది.
ఈ ఛాంపియన్షిప్లో దివ్య ప్రాతినిధ్యం వహించిన టీమ్ ర్యాపిడ్ విభాగంలో రెండో స్థానంలో.. బ్లిట్జ్ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా బ్లిట్జ్ ఫార్మాట్లో దివ్య ఆడిన ఎనిమిది గేమ్లలో ఆరు గెలిచి, ఒక డ్రా చేసుకుని, ఒకే ఒక ఓటమిని చవిచూసింది. హెక్సామైండ్ చెస్ క్లబ్ తరఫున దివ్యా పోటీ చేయగా.. హౌ యిఫాన్ డబ్ల్యూఆర్ చెస్ టీమ్ తరఫున బరిలోకి దిగింది.

తాజా విజయంతో దివ్య దేశ్ముఖ్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా దివ్యను అభినందించారు. ఆమె విజయం ధైర్యానికి, పట్టుదలకు నిదర్శనమని, యువ చెస్ క్రీడాకారులకు ప్రేరణనిస్తుందని ట్వీట్ చేశారు. నాగ్పూర్కు చెందిన దివ్య దేశ్ముఖ్, అంతర్జాతీయ మాస్టర్ (IM), ఉమెన్ గ్రాండ్మాస్టర్ (WGM) టైటిల్స్ గెలిచింది. ఆమె ఇప్పటికే ఒలింపియాడ్, ఆసియా ఛాంపియన్షిప్, వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్లో పతకాలను సాధించింది.
19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్.. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జితేంద్ర దేశ్ముఖ్, నమ్రత దేశ్ముఖ్లు వైద్యులు. చిన్న వయసులోనే చెస్ పట్ల ఆసక్తి కనబరిచిన దివ్య, ఐదేళ్ల వయసులోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆమె తండ్రి నుంచి చెస్ ఓనమాలు నేర్చుకుంది.
2020లో జరిగిన ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించిన భారత జట్టులో దివ్య దేశ్ముఖ్ ఓ సభ్యురాలు. 2021లో భారత్ నుంచి 22వ ఉమెన్ గ్రాండ్మాస్టర్గా గుర్తింపు సాధించింది. 2022లో మహిళల ఇండియన్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. 2022 చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగత విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. 2023లో కజకిస్తాన్లోని అల్మాటిలో జరిగిన ఆసియా మహిళల చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. 2024లో మహిళల అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్ను (వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్) గెలుచుకుంది.