పారిస్ పారాలింపిక్స్లో సత్తా చాటి కాంస్య పతకాన్ని సాధించిన తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి వ్యక్తిగత జీవితంలోనూ విజయం సాధించింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి.. మేధోపరమైన బలహీనతతో జన్మించింది. దాంతో చదువు, ట్రైనింగ్ కోసం ఆమె తల్లిదండ్రులు కల్లెడ గ్రామంలో తమకు ఉన్న ఎకరం భూమిని అమ్మేశారు.
2016లో రూ. 9 లక్షలకు ఆ భూమిని అమ్మేసి దీప్తి జీవాంజిని అథ్లెట్గా తీర్చిదిద్దేంకు ఖర్చు చేశారు. అయితే ఆ ఎకరం భూమిలోని అర ఎకరాన్ని రూ. 11 లక్షలకు దీప్తి జీవాంజి తిరిగి కొనుగులు చేసి తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చింది. గతేడాది చైనా వేదికగా జరిగిన పారా ఆసియా గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 11 లక్షల క్యాష్ అవార్డ్తో ఆ భూమిని కొనుగోలు చేసింది.

శభాష్ దీప్తి..
తాజాగా పారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించడంతో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. దీప్తి జీవాంజిపై నెటిజన్లు సర్వత్రా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విజయమంటే ఇదేనని కామెంట్ చేస్తున్నారు. అతి త్వరలోనే మిగతా అర ఎకరం కూడా కొనుగోలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు.
పారిస్ పారాలింపిక్స్లో మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరి ఫైనల్లో దీప్తి జీవాంజి 55.45 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. పారాలింపిక్స్ అథ్లెటిక్స్లో పతకం సాధించిన తొలి ప్లేయర్గానూ దీప్తి జీవాంజి చరిత్ర సృష్టించింది.
దీప్తికి ఘన స్వాగతం...
కాంస్యపతకంతో స్వదేశం చేరిన దీప్తి జీవాంజికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్(శాట్స్) అధికారులు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గురువారమే ఢిల్లీకి చేరుకున్న దీప్తికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండీవయను కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఆమెను సత్కరించారు.
పారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకంతో రాణించినా, ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాయని దీప్తి జీవాంజి తెలిపింది. అనార్యోగం కారణంగా స్వర్ణం సాధించలేకపోయానని చెప్పిన దీప్తి.. భవిష్యత్తులో బంగారు పతకం సాధిస్తానని చెప్పింది. ఈ సందర్భంగా తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపింది.
బంగారు పతకమే లక్ష్యం..
'కాంస్య పతకం గెలవడం సంతోషంగా ఉంది. కానీ బంగారు పతకం గెలవడమే నా లక్ష్యం. నాకు కాస్త అనారోగ్యంగా ఉండటం వల్ల బంగారు పతకాన్ని అందుకోలేకపోయాను. భవిష్యత్లో బంగారు పతకం సాధిస్తా. నా కోచ్, తల్లిదండ్రులు నా విజయానికి పూర్తిగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. 8 ఏళ్ల కఠోర శ్రమకు ఫలితం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ థ్యాంక్స్'అనిదీప్తి జీవాంజి చెప్పుకొచ్చింది.
రమేశ్ శిక్షణతో..
చిన్నతనంలో పరుగు పందెంలో రాణించిన దీప్తిని స్కూల్ పీఈటీ ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణతో ఆమె కథ మారిపోయింది. రమేశ్ ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో చేర్పించారు. ఆ తర్వాత శిక్షణలో దీప్తి రాటుదేలింది.
కోచ్ రమేశ్ శిక్షణతో, పుల్లెల గోపించంద్ అండతో ఆమె పారా అథ్లెట్గా పతకాల వేట కొనసాగిస్తోంది. ఆసియా పారా గేమ్స్ 400 మీటర్ల ఈవెంట్లో, వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలోనూ 400 మీటర్లలో స్వర్ణాలు సాధించింది. వరల్డ్ చాంపియన్గా, వరల్డ్ రికార్డు హోల్డర్గా పారిస్ పారాలింపిక్స్లో బరిలోకి దిగి పతకం సాధించింది.