
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో తెలంగాణ అమ్మాయి, టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ సత్తా చాటింది. సింగిల్స్ విభాగంలో తృటిలో పతకాన్ని చేజార్చుకున్నా.. మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకం సాధించింది. ఆచంట శరత్ కమల్తో జత కట్టిన శ్రీజ.. ఆదివారం జరిగిన ఫైనల్లో 11-4, 9-11, 11-5, 11-6తో జావెన్ చూంగ్-లిన్ కరెన్ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్గా 53వ పతకం చేరాయి.
మహిళల సింగిల్స్లో ఆకుల శ్రీజ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో శ్రీజ పోరాడినా తుదకు 11-3, 6-11, 2-11, 11-7, 13-15, 11-9, 7-11తో లియు యాంగ్జీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్-సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జంట 11-8, 8-11, 3-11, 11-7, 4-11తో పాల్ డ్రింక్హాల్-లియామ్ పిచ్ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది.
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్ కమల్ 11-8, 11-8, 8-11, 11-7, 9-11, 11-8తో పాల్ డ్రింక్హాల్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5-11, 11-4, 8-11, 9-11, 9-11తో లియామ్ పిచ్ఫోర్డ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకపోరుకు సిద్ధమయ్యాడు.
స్టార్ పారా టీటీ క్రీడాకారిణి భవినా బెన్ పటేల్ కామన్వెల్త్లోనూ స్వర్ణంతో సత్తా నిరూపించుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ 3-5 విభాగం ఫైనల్లో 35 ఏళ్ల భవినా 12-10, 11-2, 11-9తో క్రిస్టియానా ఇక్పోయి (నైజీరియా)ను ఓడించింది. టోక్యో పారాలింపిక్స్లో రజతం నెగ్గిన భవినా..థాయ్లాండ్, ఏషియన్ పారా టీటీ టోర్నీలలోనూ రజత పతకాలతో అదరగొట్టింది. మహిళల సింగిల్స్ 3-5 కేటగిరీ కాంస్య పోరులో 34 ఏళ్ల సొనాల్బెన్ మనూభాయ్ పటేల్ 11-5, 11-2, 11-3తో స్యూ బయిలీ (ఇంగ్లండ్)పై నెగ్గి పతకం అందుకుంది. ఇక పురుషుల సింగిల్స్ 3-5 విభాగం కాంస్య పతక మ్యాచ్లో రాజ్ అరవిందన్ 0-3తో ఇసావు (నైజీరియా)పై ఓడాడు.