
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. మంగళవారం జరిగిన 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్ బరిలోకి దిగిన మీనాక్షి కాసేపటికే ప్రమాదవశాత్తు సైకిలు పైనుంచి కిందపడి ట్రాక్పై జారుకుంటూ పోయింది. అదే సమయంలో వెనక నుంచి వేగంగా దూసుకొస్తున్న న్యూజిలాండ్ సైక్లిస్ట్ బ్రయోనీ బోథా మీనాక్షిని ఢీకొట్టి ఆమె మీదుగా దూసుకెళ్లి కిందపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన వైద్యులు మీనాక్షిని స్ట్రెచర్పై బయటకు తరలించారు. ఇద్దరినీ పోటీ నుంచి తప్పించారు. ఈ పోటీలో ఇంగ్లండ్కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం సాధించింది. కాగా, ట్రాక్పై ప్రమాదం జరగడం రెండో రోజుల్లో ఇది రెండోసారి. ఇంగ్లండ్కు చెందిన మ్యాట్ వాల్స్ కూడా ఇలాగే సైకిలుపై నుంచి జారి కిందపడింది. అయితే మీనాక్షి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని భారత ఒలింపిక్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంగ్లండ్ గడ్డపై భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్లో ఖతర్నాక్ ఆటతో పతకాలు కొల్లగొడుతున్నారు. ఐదో రోజు అయిన మంగళవారం భారత్కి పతకాల పంట పండుతోంది. ఇప్పటికే టీమ్ ఈవెంట్స్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన భారత్.. మరో రజత పతకాన్ని ఖాతాలో వేసుకుంది. భారత వెయిట్లిఫ్టర్ వికాస్ ఠాకూర్ 96 కేజీల విభాగంలో 346 కిలోల బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. వికాస్ ఠాకూర్కు ఇది వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్ మెడల్. ఇంతకుముందు 2014 కామన్వెల్త్ గేమ్స్లో రజతం గెలలిచిన వికాస్.. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ పసిడితో మెరిసింది. మంగళవారం జరిగిన ఫైనల్లో 3-1 తేడాతో సింగపూర్పై విజయం సాధించి, వరుసగా రెండో ఏడిషన్లోనూ గోల్డ్ మెడల్ సాధించింది. భారత వుమెన్స్ లాన్ బౌల్స్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా, పెద్దగా ఎవ్వరికీ పరిచయం లేని ఈవెంట్లో అంచనాలకు మించి రాణించిన భారత లాన్ బౌల్స్ టీమ్, ఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్ టీమ్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి... స్వర్ణం కైవసం చేసుకుంది.