
బ్రాంజ్తో షురూ..
పురుషుల వెయిట్ లిఫ్టింగ్లో లవ్ప్రీత్ సింగ్.. 109కిలోల విభాగంలో బ్రాంజ్ మెడల్ నెగ్గాడు. స్నాచ్లో 163 కిలోల బరువు ఎత్తిన లవ్ప్రీత్.. క్లీన్ అండ్ జెర్క్ లో 192 కిలోలను ఎత్తి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. కెమరూన్కు చెందిన పెరిక్లెక్స్ నగాడ్జా మొత్తం 361 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. సమోవాకు చెందిన జాక్ హిటిలా 358 కేజీలు ఎత్తి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, లవ్ప్రీత్ గెలిచిన పతకంతో ప్రస్తుత క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం.

బాక్సింగ్లో రెండు పతకాలు పక్కా..
మహిళల బాక్సింగ్ 45 కేజీల క్వార్టర్ ఫైనల్స్లో యువ బాక్సర్ నీతూ గంగాస్ సెమీఫైనల్ చేరి పతకం ఖాయం చేసింది. క్వార్టర్స్ పోరులో నికోల్ క్లైయిడ్ ను ఓడించింది. నార్తర్న్ ఐర్లాండ్ కు చెందిన నికోల్ క్లైయిడ్ పై ఏబీడీ (ఒక బాక్సర్ గాయపడినా, ఆట జరుగుతుండగానే స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నా ప్రత్యర్థిని విజేతగా ప్రకటించే విధానం) ద్వారా విజయం సాధించింది.
తద్వారా సెమీస్కు చేరుకుంది. సెమీస్లో ఓడినా నీతూకు కాంస్యం దక్కనుంది. పురుషుల 57 కేజీల విభాగంలో హుసాముద్దీన్ 4-1 తేడాతో నమీబియాకు చెందిన బాక్సర్ ఎన్.టీ. మార్నింగ్ పై గెలిచాడు. తద్వారా సెమీస్ కు అర్హత సాధించాడు.

సత్తా చాటిన మహిళల హాకీ టీమ్..
బుధవారం పూల్-ఏలో భాగంగా జరిగిన క్వార్టర్స్ లో భారత మహిళల హాకీ జట్టు కెనడాపై 3-2 తేడాతో నెగ్గింది. భారత హాకీ ప్లేయర్లలో సలైమా 3వ నిమిషంలోనే గోల్ చేయగా నవ్నీత్ కౌర్ 22వ నిమిషంలో గోల చేసి భారత ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. అయితే అదే సమయంలో కెనడా కూడా పుంజుకుంది. ఆట 23వ నిమిషంలో బ్రియాన్ స్టేర్స్ గోల్ కొట్టగా.. 39వ నిమిషంలో హన్నా గోల్ చేసింది. ఇక ఆట చివరిఅంకంలో 51వ నిమిషంలో సంగీత కుమారి గోల్ కొట్టడంతో భారత్ విజయం సాధించింది.

జూడోలో..
జూడో పోటీలలో భాగంగా బుధవారం జరిగిన మహిళల 78 కిలోల ఈవెంట్ సెమీస్ లో భారత్ కు చెందిన తులిక మన్.. న్యూజిలాండ్ కు చెందిన సిడ్నీ ఆండ్రూస్ ను ఓడించి ఫైనల్ కు అర్హత సాధించింది. తద్వారా భారత్ కు స్వర్ణం, రజతంలో ఏదో ఒక పతకం ఖాయం చేసింది. ఫైనల్ లో ఆమె స్కాట్లాండ్ కు చెందిన సారా అడ్లింగ్టన్ తో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications
