Commonwealth Games: భారత టీమ్లో డోపింగ్ కలకలం.. ఇద్దరు అథ్లెట్లపై సస్సెన్షన్!

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ముంగిట భారత అథ్లెటిక్స్ టీమ్లో డోపింగ్ కలకలం రేగింది. స్ప్రింటర్ ఎస్.ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోప్ పరీక్షల్లో విఫలమయ్యారు. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో ఈ ఇద్దరూ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. ధనలక్ష్మి డోప్ శాంపిల్స్లో అనబోలిక్ స్టిరాయిడ్స్, ఐశ్వర్య శాంపిల్స్లో ఒస్టారిన్ అనే నిషేధిత డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. దీంతో ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్హామ్లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనకుండా ధనలక్ష్మి, ఐశ్వర్యలపై వేటుపడింది.
నిషేధిత ఉత్ప్రేరకాలు..
రెండుసార్లు డోప్ పరీక్షలో విఫలమైన వీరిద్దరిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు. ఏప్రిల్, మే నెలలో టర్కీలో శిక్షణ సందర్భంగా ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్యకు చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ధనలక్ష్మి శాంపిల్స్ సేకరించింది. ఆ తర్వాత జూన్లో తిరువనంతపురంలో శిక్షణ శిబిరం సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) శాంపిల్స్ తీసుకుంది. ఈ రెండు శాంపిల్స్లోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. కామన్వెల్త్ క్రీడల్లో 100 మీటర్లు, 4×100 మీ రిలే విభాగాలకు 24 ఏళ్ల ధనలక్ష్మి ఎంపికైంది. 4×100 మీ రిలేలో ద్యుతీ చంద్, హిమ దాస్, శ్రావణి నందా బరిలో ఉన్నారు.
ఎమ్.వి జిల్నాకు చాన్స్..
ప్రస్తుతం యుజీన్లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్కు సైతం ధనలక్ష్మి ఎంపికైంది. అయితే వీసా సమస్యలతో ఆమె వెళ్లలేకపోయింది. ఈ ఏడాది జూన్ 26న కొసనోవ్ స్మారక అథ్లెటిక్స్ మీట్లో 200 మీటర్ల పరుగును 22.89 సెకన్లలో ముగించి కెరీర్ అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన ధనలక్ష్మి బంగారు పతకం సాధించింది. సరస్వతి సాహా (22.82 సె), హిమ దాస్ (22.88 సె) తర్వాత 23 సెకన్లలోపు టైమింగ్ నమోదు చేసిన మూడో భారత అథ్లెట్గా రికార్డు సృష్టించింది. ధనలక్ష్మిపై వేటు పడటంతో ఆమె స్థానంలో ఎమ్.వి. జిల్నా కామన్వెల్త్ క్రీడలకు వెళ్లనుంది.
చెన్నైలోనూ..
ఇక గత నెలలో చెన్నైలో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నాడా అధికారులు నిర్వహించిన పరీక్షలో 24 ఏళ్ల ఐశ్వర్య పాజిటివ్గా తేలింది. ఈ ఛాంపియన్షిప్లో ట్రిపుల్ జంప్లో, లాంగ్జంప్లో ఐశ్వర్య విజేతగా నిలిచింది. ఆయా పోటీల అనంతరం ఆమె నుంచి శాంపిల్స్ సేకరించారు. రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. కామన్వెల్త్ క్రీడల్లో ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్కు ఐశ్వర్య ఎంపికైంది. చెన్నై పోటీల్లో ట్రిపుల్ జంప్లో 14.14 మీటర్లతో ఐశ్వర్య జాతీయ రికార్డు నమోదు చేసింది. లాంగ్ జంప్ అర్హత రౌండ్లో 6.73 మీటర్లు దూకింది. దిగ్గజ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్ (6.83 మీ) తర్వాత ఐశ్వర్య భారత అత్యుత్తమ లాంగ్ జంపర్గా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications